అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్బంగా ఆయనకు నివాళులర్పించి మరోసారి చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యులపై కపట ప్రేమ చూపించరని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు.
అమరావతి: అధికారంలో వుండగా ఆర్యవైశ్యులకు అన్యాయం చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ఇప్పుడు ప్రతిపక్షంలో వున్నారు కాబట్టి కపట ప్రేమ చూపిస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ (vellampalli srinivas) ఆరోపించారు. జనసేన పార్టీ (janasena party) అధ్యక్షులు పవన్ కల్యాణ్ (pawan kalyan) కూడా ఆర్యవైశ్యులపై చంద్రబాబు మాదిరిగానే కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని అన్నారు. వీరిని ఆర్యవైశ్య సమాజం నమ్మే పరిస్థితులు లేవని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు.
''చంద్రబాబుకి అమరజీవి పొట్టి శ్రీరాములు నిన్ననే(బుధవారమే) గుర్తుకు వచ్చినట్టుంది. అధికారంలో వుండగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవ నిర్మాణ దీక్ష అంటూ అమరజీవిని అవమానించింది ఇదే చంద్రబాబు కాదా..! ఆయన అధికారంలో ఉంటే తోలు తీస్తానంటాడు... ప్రతిపక్షంలో ఉంటే అండగా ఉంటానంటాడు. అందరికీ తోడుగా, అండగా ఉంటానని స్టేట్ మెంట్లు ఇవ్వడం ఆయనకు పరిపాటే'' అని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు.
''చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడో అమెరికాలో ఉన్న ఆర్యవైశ్య నాయకుడు మల్లికార్జునరావును పిలిపించి ఆయన భార్య శ్రీదేవికి మాచర్ల చైర్మన్ పదవి ఇచ్చారు. ఇలా పదవి ఇచ్చినట్టే ఇచ్చి తన సామాజికవర్గం కోసం ఏడాది నుంచే రాజీనామా చేయమని ఒత్తిడి చేసారు. చివరకు ఆమె చేత రాజీనామా చేయించడంతో మనస్థాపంతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు'' అని మంత్రి ఆవేదన వ్యక్తం చేసారు.
''గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో శంకర్ అనే విలేకరిని మీ హయాంలో హత్య చేయించింది వాస్తవం కాదా..? అలాగే మంత్రిగా పనిచేసిన సిద్దా రాఘవరావును బలవంతంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించి ఆయన ఓటమికి కారణం అయింది మీరు కాదా.. ? సినీ నటి కవితను ఏడిపించి మరీ పార్టీలోంచి బయటకు పంపలేదా..? ఇలా ఆర్యవైశ్యులను అడుగడుగునా చులకనగా చూసిందీ, అవమానించిందీ ఇదే చంద్రబాబు'' అని వెల్లపల్లి మండిపడ్డారు.
''అమరజీవి పొట్టి శ్రీరాములు వంటి మహానీయున్ని అవమానించేలా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవనిర్మాణ దీక్షగా మార్చింది చంద్రబాబు కాదా..? వైసిపి అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే తిరిగి నవంబర్ 1ని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రకటించారు. ఇది వాస్తవం కాదా..?'' అని ప్రశ్నించారు.
''ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య వాసవి సత్రాలను ఆర్యవైశ్యులకు ఇస్తే వాటిని మీరు తిరిగి తీసుకోలేదా...? రాజకీయాల్లో ఎంతో సీనియారిటీ కలిగిన రోశయ్యని ఏడిపించిన వ్యక్తి చంద్రబాబు. కానీ రోశయ్య మరణిస్తే ఆయన స్మారకార్థం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది సీఎం జగనే. ముగ్గురు మంత్రులను రోశయ్య అంత్యక్రియలకు పంపారు. ఆయన ఆస్తికలు కలపడానికి కూడా మంత్రులను పంపారు'' అని మంత్రి వెల్లంపల్లి గుర్తుచేసారు.
