వైఎస్సార్ పేరుతో దళితుల నిధులు స్వాహా...: జగన్ పై వర్ల రామయ్య ఆరోపణలు
ఎస్సీ; ఎస్టీ, గిరిజన ప్రజలకోసం కేంద్రం అందించే నిధులను సీఎం జగన్ తన తండ్రి వైఎస్సార్ పేరిట సొంతానికి ఖర్చు చేస్తున్నారని టిడిపి నాయకులు వర్ల రామయ్య ఆరోపించారు.
విజయవాడ: నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్.ఎస్.ఎఫ్.డి.సి) నిధులను జగన్ ప్రభుత్వం తన ఇష్టారాజ్యంగా వాడుకుంటుందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. రాజ్యాంగ పరంగా దళితులకు, గిరిజనులకు కేంద్రం నుండి వస్తున్న నిధులకు సైతం వైఎస్ఆర్ పేరు తగిలించి తానే సొంతంగా ఇస్తున్నట్లు జగన్ వ్యవహరిస్తున్నారని వర్ల ఆరోపించారు.
''గత రెండేళ్లుగా ఎన్.ఎస్.ఎఫ్.డి.సి నుంచి వచ్చిన నిధులను అమ్మఒడి, విద్యాదీవెనా, కానుకల పేరుతో మళ్లించి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు. ఒక్క అమ్మఒడికే ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల నుండి రూ.4341 కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల నుండి రూ.662 కోట్లు దారిమళ్లించాడు'' అని ఆరోపించారు.
''సబ్ ప్లాన్ నిధులతో తెలుగుదేశం హయాంలో చంద్రబాబునాయుడు దళితులకు స్వయం ఉపాధి కల్పిస్తే జగన్ రెడ్డి మాత్రం ముష్టి విసిరినట్లు విసురుతున్నారు. చంద్రబాబు నాయుడు దళితులకు జేసీబీలు, ఇన్నోవా కార్లు, ట్రాక్టర్లు, వాహనాలు ఇచ్చి వారి సాధికారతను సాయం చేస్తే జగన్ మాత్రం జేసీబీలు పెట్టి కూల్చడమే పనిగా పెట్టుకున్నాడు. కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశానని చెబుతున్న జగన్ రెడ్డి ఆ కార్పోరేషన్ల నుంచి ఒక లోన్ అయినా ఇచ్చాడా?'' అని నిలదీశారు.
read more రైతు దినోత్సవ సభలోనే అన్నదాతపై వైసిపి ఎమ్మెల్యే దౌర్జన్యం... లోకేష్ సీరియస్
''తెలుగుదేశం పాలనలో 2018-19 లో బడ్జెట్ కేటాయింపుల్లో ఎస్సీ వర్గాల అభ్యున్నతికి రూ.14,367 కోట్లు కేటాయించి 90 శాతం ఖర్చు చేశాం. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆర్బాటంగా రూ.15 వేల కోట్లు కేటాయించి ఖర్చు చేసింది కేవలం రూ. 4,700 కోట్లు మాత్రమే. 2020-21 బడ్జట్ లో సైతం ఎస్సీ సంక్షేమానికి రూ.15,735 కోట్లు కేటాయించామని అబద్దాలు చెబుతూ నవరత్నాలకు కేటాయించిన రూ.7525 కోట్ల కలిపి చూపించారు. 2021-22 లో సైతం నవరత్నాలకు కేటాయించిందే దళిత సంక్షేమం కింద లెక్కకట్టి మాయల పకీర్ లెక్కలు చెబుతున్నాడు జగన్ రెడ్డి'' అని మండిపడ్డారు.
''జగన్ రెడ్డి చెప్పే మోసపు లెక్కలు విని మోసపోవడానికి దళితులు సిద్దంగా లేరు. అంబేడ్కర్ రాజ్యాంగ పరంగా దళితులకు రావాల్సిన నిధులు పొందడం వారి హక్కు. కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సగర్వంగా తీసుకునేందకు దళితులు జగన్ ప్రభుత్వంపై పోరాడేందుకు సిద్దపడుతున్నారని జగన్ ప్రభుత్వం గుర్తించుకోవాలి. దళితులు ప్రభుత్వానికి బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇకనైనా చట్టపరంగా వారికి రావాల్సిన నిధులకు పేర్లు తగిలించడం మాని కార్పొరేషన్ల ద్వారా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. లేని పక్షంలో దళితులందరూ సంఘటితంగా ప్రభుత్వ దళిత వ్యతిరేక చర్యలకు నిరసనగా పోరాడుతారు'' అని వర్ల రామయ్య హెచ్చరించారు.