కాపులను తిట్టడం ప్రతి అడ్డమైనోడికి ఫ్యాషనైపోయింది..: వంగవీటి రాధ సంచలనం (వీడియో)
తాను పుట్టిన కాపు కులంపైనే వెటకారంగా మాట్లాడటం ప్రతి అడ్డమైనోడికి ఓ ఫ్యాషన్ అయిపోయిందంటూ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ మండిపడ్డారు.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం కులాల పంచాయితీ జరుగుతోంది. ఇటీవల పవన్ కల్యాణ్ కాపు సామాజిక వర్గం గురించి వ్యాఖ్యలపై రాజకీయంగా చర్చ జరుగుతున్న సమయంలోనే టిడిపి నాయకులు వంగవీటి రాధాకృష్ణ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలోని ఖమ్మంజిల్లా ఎర్రుబాలెం మండలం కొత్తపాలెం గ్రామంలో దివంగత వంటవీటి మోహనరంగా విగ్రహాన్ని ఆయన తనయుడు రాధా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాధ మాట్లాడుతూ... తన తండ్రి రంగాను కేవలం కాపులే కాదు అన్ని వర్గాల ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారన్నారు. తరాలు మారినా, యుగాలు మారినా ఈ ధరిత్రి ఉన్నంతవరకు రంగా ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారన్నారు.
''రంగా కాపులకు ఆరాధ్య దైవమైతే... అన్ని వర్గాల పేదలకు గుండె చప్పుడు. మన నాయకుడు రంగాని మనం కాపాడుకోలేకపోయాం. ఇప్పుడయినా ఆవేశం తగ్గించి ఆలోచనతో ఉన్న నాయకులనయినా కాపాడుకోమని కోరుతున్నా'' అన్నారు.
వీడియో
''నేడు పుట్టిన కులాన్ని తిట్టడం ప్రతి అడ్డమైనోడికి ఫ్యాషన్ అయిపోయింది. వాళ్లేదో గొప్పగా భావిస్తూ... పుట్టిన కులాన్ని వెటకారం చేస్తున్నారు. ఈ కులం వారంతా ఐక్యంగా ఉంటే ప్రభుత్వాలనే పడగొట్టే సత్తా ఉంది. ఐకమత్యమే బలం.. ఉన్నవారిని అయినా కాపాడుకోండి'' అని వంగవీటి రాధా కాపులకు సూచించారు.
read more పవన్ బాటలో.. బద్వేల్ ఉపఎన్నిక బరి నుంచి తప్పుకున్న టీడీపీ
ఇటీవల జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ కూడా వంగవీటి రంగా హత్యపై స్పందించారు. తాను నెల్లూరు, చెన్నై లో వుండగా రంగా పేరును ఎక్కవగా వినేదని...ఆయన కులాల తగాదాలో చనిపోవడం బాధాకరమన్నారు. రంగాను అందరూ చూస్తుండగానే అతి కిరాతకంగా హతమార్చారని... ఆయన చుట్టుపక్కన ఉన్నవారెవ్వరూ అడ్డుకోలేకపోయారన్నారు. ఎప్పుడూ ఆయన చుట్టూ ఉండేవారు ఆ రోజు ఎక్కడికి వెళ్లారంటూ పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
పవన్ చాలా రోజుల తరువాత వంగవీటి రంగా పేరు ప్రస్తావించడంతో కాపు సామాజికవర్గం అనుకూలంగా జనసేన ఉంటుందని ఓ సంకేతం ఇచ్చారు. ఇదే తరుణంగా వంగవీటి రాధా కూడా కాపులు ఐకమత్యంగా వుండే ప్రభుత్వాలను సైతం పడగొట్టే సత్తా వుందంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.