నారా లోకేష్ పాదయాత్రలో వంగవీటి రాధా.. ఆ ప్రచారానికి తెర పడినట్టేనా..?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర కొనసాగుతుంది. లోకేష్ పాదయాత్రలో పాల్గొంటున్న పలువురు టీడీపీ నేతలు సంఘీభావం తెలుపుతున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర కొనసాగుతుంది. లోకేష్ పాదయాత్రలో పాల్గొంటున్న పలువురు టీడీపీ నేతలు సంఘీభావం తెలుపుతున్నారు. లోకేష్ పాదయాత్ర నేటితో 37వ రోజుకు చేరింది. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర సాగుతుంది. మంగళవారం ఉదయం కలికిరి ఇందిరమ్మనగర్ విడిది కేంద్రం వద్ద మైనారిటీలతో లోకేష్ మాట్లాడారు. అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. కలికిరి వద్ద లోకేష్ పాదయాత్రలో టీడీపీ నేత వంగవీటి రాధా పాల్గొన్నారు. లోకేష్తో కలిసి నడిచిన రాధా.. పాదయాత్రకు తన సంఘీభావం తెలియజేశారు.
ఇక, నారా లోకేష్, వంగవీటి రాధా ఈరోజు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. తాజాగా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే.. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్న వంగవీటి రాధా.. ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో మాత్రం పాల్గొన్నారు. ఎన్నికల తర్వాత పలు సందర్భాల్లో వంగవీటి రాధా టీడీపీని వీడనున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలను ఆయన ఖండించారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి రాధా పోటీ చేస్తారనే విషయంలో టీడీపీ అధిష్టనం క్లారిటీ ఇవ్వలేదు.
అయితే గత కొద్ది రోజులుగా వంగవీటి రాధా జనసేనలో చేరనున్నారనే ప్రచారం సాగుతుంది. వంగవీటి రాధాను బందరు నుంచి బరిలో నిలుపాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆలోచిస్తున్నారన ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే లోకేష్తో వంగవీటి రాధా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ ద్వారా వంగవీటి రాధా టీడీపీలోనే కొనసాగుతున్నారనే సంకేతాలను పంపినట్టుగా అవుతుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అలాగే రాధా పోటీ చేసే స్థానంపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ భేటీ తర్వాత రాధా ఏ విధంగా ముందుకు సాగనున్నారనేది వేచిచూడాల్సి ఉంది.