Asianet News TeluguAsianet News Telugu

ఏపీ రాజకీయాల్లో చర్చ: నేడు అనుచరులతో వంగవీటి రాధా భేటీ

మాజీ ఎమ్మెల్యే  వంగవీటి రాధా  ఇవాళ  తన  అనుచరులతో సమావేశం  కానున్నారు.

Vangaveeti  Radha  Meeting  with followers  today lns
Author
First Published Aug 10, 2023, 10:42 AM IST

 

విజయవాడ: మాజీ ఎమ్మెల్యే  వంగవీటి రాధా  గురువారంనాడు  అనుచరులతో  సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి రావాలని  ముఖ్య నేతలకు  వంగవీటి రాధా  సమాచారం పంపారు. వంగవీటి రాధా  ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు  ముందు  వంగవీటి రాధా  టీడీపీలో చేరారు.  ఆ ఎన్నికల్లో ఆయన  పోటీ చేయలేదు. తాను కోరిన సీటును  ఇవ్వనందుకు వంగవీటి రాధా  వైఎస్ఆర్‌సీపీని వీడి  టీడీపీలో చేరారు.

వంగవీటి రాధా సోదరి ఆశా కూడ  రాజకీయాల్లో ప్రవేశించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది.ఈ విషయమై  సోషల్ మీడియాలో  జోరుగా ప్రచారంలో ఉంది.  అయితే  ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నెల  28వ తేదీన వంగవీటి రంగా  సోదరుడు  రాధా జయంతి  కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున  నిర్వహించాలని  భావిస్తున్నారు.  వంగవీటి రంగా కార్యక్రమాల మాదిరిగానే  రాధా జయంతిని నిర్వహించే విషయమై అనుచరులతో చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా  ఆయన అనుచరవర్గాలు చెబుతున్నాయి.  

పార్టీ మార్పు విషయమై ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం ఉండకపోవచ్చని వారు చెబుతున్నారు. అయితే  రాజకీయవర్గాల్లో మాత్రం  వంగవీటి రాధా  పార్టీ మారుతారనే  ప్రచారం కూడ  లేకపోలేదు.  వంగవీటి రాధా జనసేనలో చేరుతారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. అయితే  ఈ విషయమై  వంగవీటి రాధా నుండి స్పష్టత లేదు.

టీడీపీలో  ఉన్నప్పటికీ మాజీ మంత్రి కొడాలి నాని,  గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో  వంగవీటి రాధాకు  మంచి స్నేహం ఉంది. ఈ ఇద్దరితో  సమయం దొరికినప్పుడల్లా  వంగవీటి రాధా  సమావేశమౌతుంటారు.  గుడివాడలో  వంగవీటి రంగా కార్యక్రమాల్లో  వంగవీటి రాధా  పాల్గొనేవారు.  ఆ తర్వాత  లోకేష్  పాదయాత్రలో కూడ  వంగవీటి రాధా పాల్గొన్న విషయం తెలిసిందే. తన అనుచరులతో  భేటీలో వంగవీటి రాధా ఏం చెబుతారోననేది  రాజకీయవర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios