తండ్రి లేడు.. కన్నపిల్లలను కంటికి రెప్పల్లా కాపాడుకోవాల్సిన తల్లి.. తమ్ముడు, తండ్రి వేధింపులకు గురిచేస్తుంటే వారికే వత్తాసు పలికింది. ఏం చేయాలో పాలుపోని ఆ యువతులు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. 

గుంటూరు : ‘మా నాన్న అనారోగ్యంతో ఈ ఏడాది జనవరిలో మృతి చెందారు. టెలీకాలర్ గా పనిచేసి అమ్మకు డబ్బులు ఇస్తున్నారు. అయినా భోజనం కూడా సరిగా పెట్టడం లేదు. అమ్మ, ఆమె సోదరుడైన చిన్న మామ, తాత వేధిస్తున్నారు. చిన్న మామ చెప్పినట్లు వినకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారు. లైంగికంగా వేధిస్తున్న చిన్నమామ నుంచి రక్షణ కల్పించాలి’ స్పందన లో నగరానికి చెందిన అక్కాచెల్లెళ్ల ఆవేదన ఇది. 

గుంటూరు రూరల్, అర్బన్ జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. అర్బన్ లో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేశారు. అర్జీదారులు అర్జీలను బాక్స్ లో వేశారు. రూరల్ లో స్పందన సీఐ శ్రీనివాసరావు బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. స్పందనలో అందిన కొన్ని ఫిర్యాదులు…

నగరంలోని ఓ ఏరియా లో ఉంటున్న హిజ్రా, కొంతమంది మందుబాబులు, బ్లేడ్ బ్యాచ్ తో కలిసి రాత్రులు డబ్బుల కోసం బెదిరిస్తున్నట్లు ఓబులనాయుడు పాలెంలో ఉంటున్న కొందరు హిజ్రాలు ఆరోపించారు. సదరు హిజ్రా బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిసరాల్లో దౌర్జన్యానికి పాల్పడుతుందని అర్జీలో పేర్కొన్నారు. సదరు హిజ్రా చేస్తున్న అరాచకాలకు వత్తాసు గా ఉండాలని, లేకపోతే చనిపోయే ముందు తమ పేరును రాస్తానని బెదిరిస్తున్నారని, హిజ్రా నుంచి తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు.

ఆంధ్ర లూధరన్ సంఘం ఎన్నిక కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా నిర్వహించారని, వారిపై చర్య తీసుకోవాలని ఏఈఎల్ సీ కార్యదర్శి కిషోర్, ఉపాధ్యక్షుడు ప్రసన్న కుమార్, కోశాధికారి కె. మోజెస్ ఆర్నాల్డ్ పలువురు పాస్టర్లతో కలిసి అర్జీ అందించారు. సంఘంతో సంబంధం లేని వారితో ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న ప్యానల్ ను రద్దు చేసి పాత ప్యానెల్ను కొనసాగించాలని విన్నవించారు.

కొత్త ఇంటి నిర్మాణం కోసం కన్స్ట్రక్షన్ కు రూ. 20 లక్షలు కాంట్రాక్టు ఇచ్చినట్లు ఆనంద పేట మేకల వారి వీధికి చెందిన ఎస్ బాలు తెలిపారు. గతేడాదిలో ఇంటి పనులు ప్రారంభించగా, విడతలవారీగా సుమారు రూ. 17 లక్షలు చెల్లించారు. పనులు మొదలు పెట్టిన రెండు నెలలకు రెండు అంతస్థులు కూలిపోయాయి. ప్రస్తుతం ఇల్లు కట్టించి ఇవ్వకపోగా డబ్బులు అడిగితే ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నారని, తనకు న్యాయం చేయాలని కోరారు.

ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇద్దరు మోసగించారని వసంతరాయ్పురం వాసి చక్రవర్తి, లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన శివ నాగ చారి, పొన్నూరు రోడ్డు కి చెందిన కనకమహాలక్ష్మి ఫిర్యాదు చేశారు. ఒంగోలుకు చెందిన ఇద్దరు పరిచయమై, ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్ గార్డెన్, జిల్లా/ మండల సమన్వయ కర్తలుగా ఉద్యోగాలు కల్పిస్తామంటూ ముగ్గురం విడతలవారీగా వారికి రూ. 3.75 లక్షలు చెల్లించాం. ఇద్దరిలో ఒకరు చిత్ర పరిశ్రమలో పని చేస్తానని, చేస్తాం అని మరొక నిర్వహిస్తామని నమ్మబలికారు అని, తమకు న్యాయం చేయాలని కోరారు.

వీళ్ళ కిందట తన కొడుకుకి ఎస్సై ఉద్యోగం ఇప్పిస్తానంటూ తెలిసినవారికి రూ. మూడు లక్షలు ఇచ్చినట్లు ప్రకాశం జిల్లా కంభం వాసి ఏ మహేశ్వరరావు తెలిపారు. గతంలో అతడు ప్రకాశం జిల్లాలో పోలీసు ఉన్నతాధికారుల కార్యాలయాల్లో పని చేసేవాడు అని పేర్కొన్నారు. ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో పని చేస్తున్నట్లు తెలిసిందని, తాను చెల్లించిన డబ్బులు ఇప్పించాలని అర్జీ అందించారు.