పులివెందులలో కాల్పుల కలకలం: ఒకరు మృతి, మరొకరికి గాయాలు
ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందులలో ఇద్దరు వ్యక్తులపై భరత్ కుమార్ కాల్పులకు దిగాడు.
కడప: ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందులలో మంగళవారంనాడు కాల్పుల ఘటన కలకలం రేపింది. భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఇద్దరిని తుపాకీతో కాల్చాడు. ఈ ఘటనలో దిలీప్, మస్తాన్ భాషాలకు గాయాలయ్యాయి. ఆర్ధిక విబేధాల కారణంగానే ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుందని సమాచారం . కాల్పుల ఘటనలో గాయపడిన ఇద్దరిని పులివెందులలోని ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం దిలీప్ ను కడప రిమ్స్ కు తరలించారు. కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన దిలీప్ మృతి చెందాడు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో భరత్ కుమార్ యాదవ్ గతంలో సీబీఐ అధికారులు ప్రశ్నించారు.
దిలీప్ , భరత్ కుమార్ యాదవ్ మధ్య డబ్బుల విషయమై ఇవాళ గొడవ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. పులివెందులలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఈ గొడవ జరిగింది. ఈ విషయమై వీరిద్దరి మధ్య మాటా మాటా పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ సమయంలో ఆవేశానికి లోనైన భరత్ కుమార్ యాదవ్ తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులకు దిగినట్టుగా భాషా మీడియాకు చెప్పారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ కు భరత్ యాదవ్ బంధువు. ఈ కేసులో భరత్ యాదవ్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు.
భరత్ కుమార్ యాదవ్ వద్ద దిలీప్ డబ్బులు తీసుకున్నట్టుగా చెబుతున్నారు. ఈ విషయమై భరత్ కుమార్ యాదవ్ దిలీప్ తో గొడవకు దిగారని సమాచారం. భరత్ కుమార్ జరిపిన కాల్పల్లో దిలీప్ ఉన్న మస్తాన్ భాషాకు గాయాలయ్యాయి. గాయపడిన దిలీప్, మస్తాన్ భాషాలు ఇద్దరు బంధువులు. భరత్ కుమార్ యాదవ్ ఏదో ఒక ఘటనలో తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. తుపాకీతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయనపై ఆరోపణలు కూడా లేకపోలేదు.
దిలీప్, మస్తాన్ భాషాలపై కాల్పులకు దిగిన తర్వాత భరత్ కుమార్ యాదవ్ పోలీసులకు లొంగిపోయాడని ప్రచారం సాగుతుంది. అయితే ఈ విషయమై పోలీసులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది. దిలీప్, భాషాలపై భరత్ కుమార్ నాలుగు రౌండ్లకు పైగా కాల్పులకు దిగారని సమాచారం. దిలీప్ పై అత్యంత సమీపం నుండి కాల్పులకు దిగడంతో ఆయనకు తీవ్ర గాయాలై మృతి చెందినట్టుగా వైద్యులు చెబుతున్నారు. భరత్ కుమార్ యాదవ్ గతంలో ఓ పత్రికలో విలేకరిగా పనిచేశాడు.
దిలీప్ రమ్మంటే బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్దకు వెళ్లా: బాషా
దిలీప్ రమ్మని ఫోన్ చేస్తే తాను సిండికేట్ బ్యాంకు నుండి బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్దకు వెళ్లినట్టుగా భాషా మీడియాకు చెప్పారు. దిలీప్ తో గొడవకు దిగి ఆ తర్వాత భరత్ కుమార్ యాదవ్ వెళ్లిపోయాడని భాషా చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే తిరిగి అక్కడికి చేరుకున్నభరత్ కుమార్ యాదవ్ తుపాకీతో కాల్పులకు దిగినట్టుగా మస్తాన్ భాషా మీడియాకు వివరించారు.