గుంటూరులో తల్లీకూతుళ్లపై ప్రేమోన్మాది దాడి చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిందితుడితో బాధిత యువతి చేసిన ఛాటింగ్ వెలుగులోకి వచ్చింది. అయితే పోలీసులు దానిని పాతదిగా చెబుతున్నారు.
గుంటూరులో తల్లీకూతురిపై ఓ యువకుడి దాడి కేసు కొత్త మలుపు తిరిగింది. గీతా సాయి, ధర్మతేజల మధ్య చాటింగ్ బయటకు వచ్చింది. అంతేకాదు తనతో మాట్లాడాలంటూ ధర్మతేజను కోరుతూ గీత ఆత్మహత్యాయత్నం చేసిన వీడియో కూడా బయటకు వచ్చింది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తం మరో మలుపు తిరిగినట్లయ్యింది. అయితే పోలీసులు మాత్రం అది పాత వీడియో అని చెబుతున్నారు. తల్లీకూతురిపై దాడి చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు వివరిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే... గుంటూరు (guntur crime) పట్టణంలోకి కృష్ణనగర్ ప్రాంతానికి ఓ యువతి కుటుంబంతో కలిసి నివాసముంటోంది. అయితే గతకొంతకాలంగా ఓ యువకుడు ఈమె వెంటపడుతూ ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నారు. అతడి ప్రేమను యువతి అంగీకరించకపోయేసరికి కోపాన్ని పెంచుకున్నాడు. ఉన్మాదంతో విచక్షణ కోల్పోయిన అతడు దారుణ నిర్ణయం తీసుకున్నాడు.
కృష్ణనగర్ పిఎఫ్ కార్యాయలం దగ్గర్లో యువతి కుటుంబం నివాసముండే అపార్ట్ మెంట్ లోకి యువకుడు బలవంతంగా చొరబడ్డాడు. ప్లాట్ లో యువతితో పాటు ఆమె తల్లి మాత్రమే వున్నారు. ఈ క్రమంలో తనవెంట తెచ్చుకున్న బ్లేడ్ తో యువతి గొంతుకోసి చంపడానికి ప్రయత్నించాడు. అయితే కూతురు అరుపులు విని తల్లి వచ్చి ఈ దాడిని అడ్డుకుంది. దీంతో ఆమెపైనా దాడికి తెగబడ్డాడు. ఇలా తల్లీకూతుళ్లను బ్లేడ్ తో గాయపర్చాడు ఈ ఉన్మాది.
Also Read:గుంటూరులో ప్రేమోన్మాది ఘాతుకం... ఇంట్లోకి చొరబడి యువతిపై బ్లేడ్ తో దాడి, అడ్డొచ్చిన తల్లిపైకూడా..
ఈ దాడి అనంతరం అపార్ట్ మెంట్ రెండో అంతస్తు నుండి దూకే ప్రయత్నం చేసాడు యువకుడు. కానీ తల్లీకూతుళ్ల కేకలతో గుమిగూడిన అపార్ట్ మెంట్ వాసులు, స్థానికులు పరారయ్యేందుకు ప్రయత్నిస్తున్న యువకున్ని పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి యువకుడిని అప్పగించారు. ఉన్మాది చేతిలో గాయపడ్డ తల్లీకూతుళ్లను హాస్పిటల్ కు తరలించారు. అలాగే వారిపై దాడికి పాల్పడ్డ యువకుడు కూడా గాయపడగా అతడిని జీజీహెచ్కు తరలించారు.
ఈ దాడిలో స్వల్పంగా గాయపడటంతో యువతికి, ఆమె తల్లికి ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. యువకుడి పరిస్థితి కూడా మెరుగ్గానే వున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రేమ వ్యవహారమే ఈ దాడికి కారణంగా ప్రాథమికంగా నిర్దారించారు. ఉన్మాదంతో యువతిపైనే కాదు ఆమె తల్లిపై దాడిచేసి చంపడానికి ప్రయత్నించిన యువకున్ని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదిలావుంటే గత శుక్రవారం ఇలాంటి దారుణమే హైదరాబాద్ కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హఫీజ్ బాబా నగర్ యువతిపై ఓ ఉన్మాది కత్తితో విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్న స్థానిక రాజకీయ నాయకుడు హబీబ్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. తన ప్రేమను తిరస్కరించదని కోపంతో రగిలిపోయిన అతడు యువతిపై కత్తితో దాడికి దిగాడు. మద్యాహ్నం యువతి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో నిందితుడు కత్తితో వచ్చి ఆమెపై దాడికి దిగాడు. దీంతో రక్తపుమడుగులో కిందపడిన యువతి కేకలు విని స్థానికులు ఆమెను కాపాడేందుకు వచ్చారు. అయితే నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో స్థానికులను బెదిరించాడు. దీంతో కాపాడేందుకు ఎవరూ సాహసం చేయలేదు. ఇలా ఆలస్యం కావడంతో యువతిని హాస్పిటల్ కు తరలించినా ప్రాణాలు దక్కలేదు.
