Asianet News TeluguAsianet News Telugu

కానిస్టేబుల్ ప్రకాశ్ డిస్మిస్ కేసులో ట్విస్ట్... నన్ను బూచిగా చూపిస్తున్నారు, అతని తప్పేం లేదు.. బాధితురాలు

ఏపీలో కానిస్టేబుల్ ప్రకాశ్ పై సస్పెన్షన్ కేసు కొత్త మలుపు తిరిగింది. బాధితురాలు లక్ష్మి.. కావాలనే అతడిని దోషిగా నిలబెట్టారని.. తనను బూచిగా చూపిస్తున్నారని ఆరోపించింది. 

Twist in Constable Prakash Dismissal Case In andhrapradesh
Author
First Published Aug 30, 2022, 9:53 AM IST

అనంతపురం : తనను బూచిగా చూపి అనంతపురం ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ విధుల నుంచి తొలగించారని.. ఆ కేసులో పోలీసులు ‘బాధితురాలిగా’ పేర్కొన్న బీ లక్ష్మి తెలిపారు. ఈ ఏడాది జూన్ 14న  శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో జరిగిన స్పందన సభకు సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరు కాగా, తమ బకాయిలు చెల్లించాలంటూ అదేరోజు అనంతపురంలో ప్లకార్డులు ప్రదర్శించి కానిస్టేబుల్ ప్రకాష్ ను విధుల్లో నుంచి తొలగించిన విషయం తెలిసిందే. గార్లదిన్నెకు చెందిన మహిళ నుంచి ప్రకాష్ బంగారం,  డబ్బు తీసుకున్నారని అభియోగంపై అతని డిస్మిస్ చేస్తున్నట్లు అనంతపురం ఎస్పీ పకీరప్ప ఆదివారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు.

ఈ కేసులోని బాధితురాలు లక్ష్మి సోమవారం అనంతపురం ప్రెస్క్లబ్లో మాట్లాడారు. ప్రకాష్ తన నుంచి 30 తులాల బంగారం,  రూ.10 లక్షలు నగదు తీసుకున్నట్లు పోలీసులు మోపిన అభియోగంలో నిజం లేదని స్పష్టం చేశారు. కానిస్టేబుల్ తనను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని, కక్ష సాధింపులో భాగంగానే తనను అడ్డంపెట్టుకుని ఆయనను డిస్మిస్ చేశారని వాపోయారు.

 తప్పుడు స్టేట్మెంట్
‘నా భర్త, అతని కుటుంబ సభ్యులు నన్ను వేధిస్తున్నారని నాలుగేళ్ల కిందట గార్లదిన్నె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. అక్కడ న్యాయం జరగకపోవడంతో 2019లో ఎస్పీ కార్యాలయంలో స్పందన కార్యక్రమానికి వెళ్లాను. అక్కడున్న సీఎం వలి అనే కానిస్టేబుల్  నా ఫిర్యాదు చేస్తానని చెప్పి, నేను, నా భర్త వేధింపుల గురించి చెబితే అతను మరో లేఖ రాశాడు. కానిస్టేబుల్ ప్రకాష్ నన్ను వేధిస్తున్నట్లు,  అత్యాచారం చేసినట్లు, నా నుంచి డబ్బు, బంగారం తీసుకుని మోసం చేసినట్లు గా రాసాడు. 

ఎస్పీ వెళ్లిపోతున్నారని తొందర పెట్టి స్టేట్మెంట్ చదివే అవకాశం ఇవ్వకుండానే నాతో సంతకం చేయించుకున్నాడు. దాని ఆధారంగానే కేసు నమోదు చేసి అప్పటి డీఎస్పీ వీరరాఘవ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. కానిస్టేబుల్ ప్రకాష్ నాపై అత్యాచారం చేసినట్లు మీడియాతో చెప్పారు. డిఎస్పి ప్రెస్మీట్లో చెప్పింది తప్పు అని అప్పట్లోనే నేను టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిర్యాదు చేశాను. సీఐ జాకీర్  ఫిర్యాదు తీసుకోకుండా, విషయాన్నికోర్టులో తేల్చుకోవాలి అన్నారు. నేను కోర్టును ఆశ్రయించి డిఎస్పి కి లీగల్ నోటీసులు ఇప్పించాను.

ఈ కేసు కోర్టులో నడుస్తుంది. ఇదేమీ పట్టించుకోకుండా నన్ను బూచిగా చూపించి ప్రకాశ్ ను డిస్మిస్ చేయడం అన్యాయం. డీఎస్పీ మా కుటుంబ పరువుకు భంగం కలిగేలా ప్రవర్తించారు. ఇప్పుడు నా భర్త, పోలీసుల నుంచి మాకు ప్రాణహాని ఉంది. ఏదైనా జరిగితే పోలీసులే బాధ్యత’ అని లక్ష్మి ఆవేదన చెందారు. ‘నా భర్త వేధింపులు తాళలేక ఎన్నోసార్లు గార్లదిన్నె పోలీసులు,  జిల్లా ఎస్పీ ఆశ్రయించాను. స్పందనకు హాజరైనప్పుడు ప్రకాష్ పరిచయమయ్యాడు. కేసులో నాకు సహకరించారు. అప్పటికే అతనిపై కక్ష పెంచుకున్న ఉన్నతాధికారులు మా మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు చిత్రీకరించారు. కానిస్టేబుల్  సీఎం వలీ,  డీఎస్పీ వీరరాఘవ రెడ్డి  ఈ దుష్ప్రచారం చేశారు’  అని ఆమె ఆరోపించారు

Follow Us:
Download App:
  • android
  • ios