తిరుమల యాచకుడి ఇంట్లో నోట్ల కట్టలు: లెక్కిస్తున్న విజిలెన్స్ సిబ్బంది
తిరుమలలో ఓ యాచకుడి ఇంట్లో నోట్ల కట్టలు కలకలం రేపుతున్నాయి. సోమవారం నాడు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది నోట్లను లెక్కిస్తున్నారు
తిరుమల: తిరుమలలో ఓ యాచకుడి ఇంట్లో నోట్ల కట్టలు కలకలం రేపుతున్నాయి. సోమవారం నాడు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది నోట్లను లెక్కిస్తున్నారు. గత ఏడాది శ్రీనివాసన్ అనే యాచకుడు మరణించాడు. ఆయనకు తిరుమలలో ఇల్లుంది. తిరుమలలోని శేషాచలం కాలనీలో రూమ్ నెంబర్ 75 ను ఆయనకు కేటాయించారు. గత ఏడాది కరోనాతో ఆయన మరణించారు. అప్పటి నుండి ఈ ఇళ్లు ఖాళీగా ఉంది. ఈ ఇంటిని మరొకరికి కేటాయించాలనే ఉద్దేశ్యంతో ఈ ఇంటిని ఇవాళ విజిలెన్స్ అధికారులు గది తలుపులు పగులగొట్టారు. ఈ గదిలో రెండు ట్రంక్ పెట్టెల నిండా శ్రీనివాసన్ డబ్బులు దాచిపెట్టినట్టుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
శ్రీనివాసన్ కు ఎవరూ లేకపోవడంతో ఇంతవరకు ఎవరూ ఆ ఇంటికి రాలేదు. దీంతో ఆ ఇంటిని టీటీడీ ఇవాళ స్వాధీనం చేసుకొంది. ట్రంక్ పెట్టెల్లోని నగదును విజిలెన్స్ సిబ్బంది లెక్కిస్తున్నారు. సుమారు 10 లక్షలకు పైగా నగదు ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. శ్రీనివాసన్ కు చెందిన బంధువులు ఇంకా ఎవరైనా వస్తే ఈ నగదును అందించే అవకాశం ఉంది. యాచన ద్వారానే శ్రీనివాసన్ ఈ నగదును సేకరించారు. నగదులో ఎక్కువగా రెండు, ఐదు రూపాయాల నోట్లు, చిల్ల ర నాణెలు ఉన్నాయి.