చిరుతపులుల బారి నుండి  భక్తులను రక్షించేందుకు తిరుమల నడక మార్గంలో  ఇనుప కంచెను ఏర్పాటు చేయాలని టీటీడీ భావిస్తుంది.ఈ మేరకు కేంద్ర అటవీశాఖకు  అధికారులు ప్రతిపాదనలు పంపారు.


తిరుపతి: తిరుమల నడక మార్గంలో ఇనుప కంచెను ఏర్పాటు చేయాలని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.ఈ విషయమై టీటీడీ అధికారులు కేంద్ర అటవీశాఖ అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి వచ్చిన తర్వాత ఇనుప కంచెను ఏర్పాటు చేయనున్నారు టీటీడీ అధికారులు. తిరుమల నడక మార్గంలో ఇటీవల కాలంలో చిరుత పులుల కదలికలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఐదు చిరుతపులులను అటవీశాఖాధికారులు బంధించారు. ఈ నెల 7వ తేదీన మరో రెండు చిరుతల సంచారాన్ని అటవీశాఖాధికారులు గుర్తించారు. ఈ రెండు చిరుతలను బంధించేందుకు అధికారులు బోన్లను ఏర్పాటు చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తిరుమల నడక మార్గంలో ఇనుప కంచె ఏర్పాటు చేయడం ద్వారా చిరుత పులులతో పాటు ఇతర అటవీ జంతువుల నుండి భక్తులను రక్షించే అవకాశం ఉంటుందని టీటీడీ భావిస్తుంది. తిరుమల నడక మార్గంలో ఇనుప కంచె ఏర్పాటుకు అనుమతి కోరుతూ కేంద్ర అటవీశాఖ, వైల్డ్ లైఫ్ ఇనిసిట్యూట్ కు ప్రతిపాదనలు పంపారు.

ఈ ఏడాది జూన్ 22న మూడేళ్ల కౌశిక్ అనే చిన్నారిపై చిరుతపులి దాడి చేసింది.కౌశిక్ కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో బాలుడిని కొంత దూరంలో చిరుతపులి వదిలేసింది. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే ఈ ఏడాది ఆగస్టు 11న లక్షిత అనే బాలికపై దాడి చేసింది. చిరుత దాడిలో లక్షిత మృతి చెందింది. లక్షిత మృతి ఘటనతో టీటీడీ అప్రమత్తమైంది. తిరుమల నడక మార్గంలో వస్తున్న భక్తులకు చేతి కర్రలను అందిస్తున్నారు. చేతి కర్రలతో అటవీ జంతువులను ఎదుర్కోవచ్చని టీటీడీ అధికారులు చెబుతున్నారు. మరో వైపు నడక మార్గంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెండు నడక మార్గాల్లో ఐదు వందలకు పైగా ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుతల కదలికలను గమనిస్తున్నారు.

also read:తిరుమలలో మరో రెండు చిరుతల కదలికలు: అప్రమత్తమైన టీటీడీ అధికారులు

అలిపిరి నడక మార్గంలో 7.2 కి.మీ పొడవున ఇనుప కంచెను ఏర్పాటు చేయాలని టీటీడీ భావిస్తుంది. ఈ ప్రాంతంలో ఎనిమిది వేల ఎకరాల్లో అటవీ ప్రాంతం ఉంది. నడక మార్గంలో ఇనుప కంచె ఏర్పాటు చేయాలని అటవీశాఖ నుండి ప్రతిపాదనలు పంపారు.అయితే ఈ ప్రతిపాదనలకు అటవీ శాఖ నుండి అనుమతి రాగానే టీటీడీ అధికారులు ఇనుప కంచెను ఏర్పాటు చేయనున్నారు.