తిరుమలలో కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తులపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్వేతపత్రం విడుదల చేసింది. మొత్తం బ్యాంకుల్లో రూ. 15,938 కోట్ల డిపాజిట్ ఉన్నట్టుగా తెలిపింది.
తిరుమలలో కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తులపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్వేతపత్రం విడుదల చేసింది. వివిధ బ్యాంకుల్లో రూ. 15,938 కోట్ల డిపాజిట్ ఉన్నట్టుగా తెలిపింది. బంగారం 10,258.37 కేజీల బంగారం ఉన్నట్టుగా టీటీడీ పేర్కొంది. మూడేళ్లలో శ్రీవారి నగదు డిపాజిట్లు భారీగా పెరిగినట్టుగా తెలిపింది. 2019 జూన్ నాటికి రూ. 13,025 కోట్లు ఉండగా.. ప్రస్తుతం రూ. 15,938 కోట్లుకు చేరినట్టుగా పేర్కొంది. 2019 జూన్ నాటికి 7,339.74 కేజీల బంగారం నిల్వలు ఉండగా.. అది ఇప్పుడు 10,258. 37కి చేరిందని తెలిపింది. టీటీడీ డిపాజిట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెడుతున్న ప్రచారం అవాస్తవమని పేర్కొంది. టీటీడీ ఇలా ఎప్పుడూ చేయదని తెలిపింది.
జాతీయ బ్యాంకుల్లోనే టీటీడీ ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని ఈవో ధర్మారెడ్డి చెప్పారు. టీటీడీ ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో ఎలాంటి వదంతులు నమ్మవద్దని కోరారు. జాతీయ బ్యాంకుల్లోనే టీటీడీ ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని ఈవో ధర్మారెడ్డి చెప్పారు. నూతన పరకామణి భవనంలో త్వరలో శ్రీవారి హుండీ కానుకలు లెక్కింపు చేపట్టనున్నట్టుగా తెలిపారు. అక్టోబర్లో 22.72 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారని చెప్పారు. హుండీ కానుకల ద్వారా రూ. 122.23 కోట్లు ఆదాయం వచ్చిందని చెప్పారు. 1.08 కోట్ల మందికి లడ్డూల విక్రయం జరిగిందని తెలిపారు. 10.25 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని చెప్పారు. డిసెంబర్ నుంచి ప్రయోగాత్మకంగా ఉ. 8 గంటల నుంచి వీఐపీ బ్రేక్ దర్శనం అమలు చేయనున్నట్టుగా తెలిపారు. టీటీడీ డిపాజిట్లపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని చెప్పారు.
