Asianet News TeluguAsianet News Telugu

కోర్టు ధిక్కరణ కింద టీటీడీ ఈవో ధర్మారెడ్డికి జైలు శిక్ష..

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి కోర్టు నెలరోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కింద ఈ తీర్పును ఇచ్చింది. 

TTD EO Dharma Reddy jailed for contempt of court
Author
First Published Dec 14, 2022, 8:14 AM IST

అమరావతి : టీటీడీ ఈవో ధర్మారెడ్డికి హైకోర్టు నెలరోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయనందుకు ఈ మేరకు కోర్టు ధిక్కరణ కింద ఈ శిక్ష పడినట్లు తెలిసింది. దీంతోపాటు రెండు వేల రూపాయల జరిమానా కూడా విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈనెల 27లోపు ధర్మారెడ్డి హైకోర్టు రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాలని తెలిపింది. మంగళవారం నాడు హైకోర్టు సింగిల్ జడ్జి ఈ మేరకు తీర్పు నిచ్చారు. అసలేం జరిగిందంటే..

2011లో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ లో  ప్రోగ్రాం అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ను అదే ఏడాది సవాల్ చేస్తూ కొమ్ము బాబు, బి. సేవ్లా నాయక్, ఆర్ స్వామి నాయక్ హైకోర్టును ఆశ్రయించారు. వీరంతా గత 17 ఏళ్లుగా ప్రోగ్రామ్ అసిస్టెంట్లుగా టీటీడీలో పనిచేస్తున్నారు. తమను రెగ్యులరైజ్ చేసేలా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆదేశించాలని కోరారు. ఈ ఏడాది ఏప్రిల్ 13న ఈ వ్యాజ్యం మీద న్యాయస్థానం విచారణ జరిపింది. టిటిడి జారీ చేసిన నోటిఫికేషన్ ను కొట్టివేసింది. పిటిషనర్ల సర్వీసును రెగ్యులర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ నెల 19 & 23 మ‌ధ్య మ‌రో తుఫాను.. అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించిన ఐఎండీ

అయితే దీని మీద టిటిడి ఏలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో  హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదని పేర్కొంటూ ఆ ముగ్గురు ఈ ఏడాది జూన్లో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. పిటిషనర్ల తరఫున కేకే దుర్గాప్రసాద్ వాదించారు. టీటీడీ ఈవో దీని మీద కౌంటర్ దాఖలు చేశారు ఈ ఏడాది ఏప్రిల్ 13న ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను జూన్ 20న అప్పీలు చేశామని అది పెండింగ్లో ఉందని తెలిపారు. అంతేకాదు, కోర్టు ఆదేశాల అమలుకు టైం పీరియడ్ విధించలేదని తెలిపారు. సీనియర్ న్యాయవాది ఎస్ ఎస్ ప్రసాద్ ఈవో తదితరుల తరఫున వాదించారు. వారు పెట్టిన అప్పీలు పెండింగ్లో ఉందని అది ఆ సమయంలో కోర్టు ధిక్కరణ కేసు సహజంగా విచారణ చేయకూడదని అన్నారు. 

ఆ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. టీటీడీ ఈవో వేసిన కౌంటర్ పరిశీలించామని.. కోర్టు ఆదేశాల అమలు విషయంలో ప్రతివాదుల వైఖరి ఏమిటో దీని వల్ల స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. గరిష్టంగా రెండు నెలల్లో కోర్టు ఆదేశాలను అమలు చేయాలని అని తెలిపారు. అది తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగానే ఉత్తర్వులను ఉల్లంఘించారని తెలిపారు. కోర్టు ధిక్కరణ కింద టీటీడీ ఈవో ధర్మారెడ్డికి  జైలు శిక్షకు అర్హులే అని పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల రోజుల పాటు సాధారణ జైలు శిక్ష, రూ.2వేలుజరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

అయితే దీనిని  టీటీడీ తరఫు న్యాయవాది ఎస్ ఎస్ ప్రసాద్ సవాల్ చేశారు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు పై అత్యవసర విచారణ జరపాలని ధర్మాసనాన్ని కోరారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏవి శేషసాయి,  జస్టిస్ దుప్పల వెంకటరమణ లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరుపుతామని తెలిపింది. మరోవైపు గతంలో వేసిన అప్పీల్ మీద అత్యవసర విచారణ జరపాలని టీటీడీ తరఫు న్యాయవాది కోరారు. దీనిమీద కూడా ధర్మాసనం విచారణ జరిపింది. కొమ్ము బాబు, మరో ఇద్దరి సర్వీసును క్రమబద్దీకరించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు మీద స్టే విధించింది.

Follow Us:
Download App:
  • android
  • ios