తిరుమల : గదుల కేటాయింపులో అవకతవకలు.. ఈవో సీరియస్, ప్రత్యేక బృందాల ఏర్పాటు
తిరుమలలో గదుల బుకింగ్ వ్యవహారంలో అవకతవకలు తలెత్తుతూ వుండటంతో టీడీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. దీనిలో భాగంగా గదుల కేటాయింపు ప్రక్రియపై ఉన్నతాధికారులతో శనివారం ఆయన భేటీ అయ్యారు.
తిరుమలలో గదుల కేటాయింపులో తరచూ అక్రమాలు జరుగుతుండటం, పలువురు పట్టుబడుతూ వుండటంతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి సీరియస్గా దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా గదుల కేటాయింపు ప్రక్రియపై ఉన్నతాధికారులతో టీటీడీ ఈవో భేటీ అయ్యారు. ఇప్పటికే గదుల కేటాయింపులో వున్న లోపాలను టీటీడీ గుర్తించింది. గదుల కేటాయింపులో దళారులను ఏరివేసేలా.. పోలీస్, విజిలెన్స్ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ధర్మారెడ్డి నిర్ణయించారు.
Also Read:దొడ్డిదారిన వీఐపీ బ్రేక్ టికెట్ల విక్రయం.. టీటీడీలో ఇంటి దొంగల అరెస్ట్
మరోవైపు.. టీటీడీలో ఇంటి దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీవారి దర్శన టికెట్లు విక్రయిస్తున్న టీటీడీ సూపరింటెండెంట్ మల్లిఖార్జున్తో పాటు ఇద్దరు మహిళల్ని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. కొన్నేళ్లుగా భారీగా వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు విక్రయించినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 760 బ్రేక్ దర్శన టికెట్లు, 350 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, 25 సుప్రభాత సేవా టికెట్లను, 32 గదులను విక్రయించినట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ కుంభకోణంలో లక్షల రూపాయలు చేతులు మారినట్లు సమాచారం.
మరోవైపు వరుస సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరుగుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు నిండి.. వరాహస్వామి అతిధి గృహం వరకు చేరుకున్నాయి క్యూలైన్లు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.