బోయ, వాల్మీకి కులాలను  ఎస్టీ జాబితాలో చేర్చాలని  ఏపీ అసెంబ్లీ తీర్మానం  చేయడంపై ఆదీవాసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నాయి.

 అమరావతి: బోయ, వాల్మీకీలను ఎస్టీల్లో చేర్చాలని అసెంబ్లీ తీర్మానం చేయడంపై ఆదీవాసీలు భగ్గుమన్నాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్ కు పిలుపునిచ్చాయి ఆదీవాసీ సంఘాలు . ఆదీవాసీ సంఘాల బంద్ కు విపక్షాలు, మావోయిస్టు పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. 

బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చాలని ఏపీ అసెంబ్లీ ఈ నెల 24న తీర్మానం చేసింది.ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. బోయ, వాల్మీకి కులాలను బీసీ జాబితా నుండి ఎస్టీ జాబితాలో చేర్చడంపై ఆదీవాసీ సంఘాలు మండిపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఆదీవాసీ సంఘాలు ఇవాళ బంద్ కు పిలుపునిచ్చాయి. ఇవాళ ఉదయం నుండి ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదీవాసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఏజెన్సీ ప్రాంతాల బంద్ కు పిలుపునివ్వడంతో ముందు జాగ్రత్తగా ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపివేశారు. పాడేరు., అరకు ప్రాంతాల్లో ఆదీవాసీ సంఘాలు ఇవాళ ఉదయం నుండి నిరసనకు దిగాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాలను మూసివేశారు. రంపచోడవరం, పాడేరు, అరకు బస్టాండ్ ల వద్ద ఆదీవాసీలు బైఠాయించారు. ఏఓబీలో భద్రతను పెంచారు. ఏజెన్సీ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. 

పాదయాత్ర సందర్భంగా బోయ, వాల్మీకీలను బీసీ జాబాతా నుండి ఎస్టీల్లో చేర్చుతామని హామీ ఇచ్చారు జగన్, ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ విషయమై ఏపీ అసెంబ్లీ లో ఈ మేరకు తీర్మానం చేశారు. ఈ తీర్మానంపై కేంద్రం ఎలా నిర్ణయం తీసుకుంటుందో చూడాలి