40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుండి విజయనగరం బయలుదేరిన ట్రావెల్స్ బస్సు అర్ధరాత్రి ఎన్టీఆర్ జిల్లాలో ప్రమాదానికి గురయ్యింది.
నందిగామ : గురువారం రాత్రి హైదరాబాద్ నుండి విజయనగరంకు 40 మంది ప్రయాణికులతో ఓ ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. అర్ధరాత్రి ఎన్టీఆర్ జిల్లాలో ప్రయాణిస్తుండగా ఈ బస్సు అదుతప్పి బోల్తాపడింది. నిద్రలో వున్న ప్రయాణికులు లేచిచూసేసరికి బస్సు రోడ్డుపక్కన గుంతలోకి దూసుకెళ్లి బోల్తాపడివుంది. అందరి అదృష్టం బావుండి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఎనిమిదిమంది ప్రయాణికులు మాత్రం గాయపడ్డారు.
బాధిత ప్రయాణికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గురువారం రాత్రి హైదరాబాద్ నుండి విజయనగరంకు మయూరి ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. మొత్తం 40మంది ప్రయాణికులతో పాటు ట్రావెల్స్ సిబ్బందితో బయలుదేరిన బస్సు అర్ధరాత్రికి ఎన్టీఆర్ జిల్లాకు చేరుకుంది. రాత్రి కావడంతో జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కువగా లేకపోవడంతో బస్సు మంచి స్పీడ్ తో దూసుకుపోతుండగా అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ సమీపంలోని తోటచర్ల, మునగచర్ల మధ్యలోగల పెట్రోల్ బంక్ వద్ద బస్సు అదుపుతప్పింది. వేగంగా వెళుతున్న బస్సును అదుపుచేయడం డ్రైవర్ కు సాధ్యంకాకపోవడంతో అదికాస్తా రోడ్డుపక్కన ఓ కందకంలోకి దూసుకెళ్లింది. దీంతో బస్సు అమాంతం ఓ పక్కకు బోల్తాపడింది.
వీడియో
అయితే బస్సు మెల్లిగా ఓ పక్కకు ఒరిగి బోల్తా పడటంతో ప్రమాదం తప్పింది. ప్రయాణికులు చిన్న కుదుపుకు మాత్రమే గురయ్యారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 40మంది ప్రయాణికులు వుండగా వారిలో కేవలం ఓ 8మంది మాత్రమే స్వల్పంగా గాయపడ్డారు.
Read More కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగ:వెంకటగిరి రైల్వే స్టేషన్లో నిలిపివేత
ట్రావెల్స్ బస్సు బోల్తాపడటం గమనించిన స్థానికులు వెంటనే అందులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. పోలీసులు కూడా సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ప్రయాణికులు మరో బస్సులో అక్కడినుండి తరలించారు.
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. బస్సు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బస్సు ప్రమాదం నుండి ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.