అలీ, పోసాని కృష్ణమురళిలకు పదవులపై సీఎం జగన్ నిర్ణయం!.. త్వరలోనే ప్రకటన..?
టాలీవుడ్ నటులు పోసాని కృష్ణమురళి, అలీలకు పదవులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ కోసం పనిచేసిన పోసాని, అలీలకు ఒకేసారి పదవులు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం.
టాలీవుడ్ నటులు పోసాని కృష్ణమురళి, అలీలకు పదవులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీని నియమించాలని సీఎం జగన్ నిర్ణయించినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మరోవైపు పోసాని కృష్ణమురళికి ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన నిర్ణయం జరిగిందని.. ప్రస్తుతం ఆ ఫైల్ సీఎం జగన్ దగ్గర ఉందని చెబుతున్నారు. త్వరలోనే అధికార ప్రకటన రావొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరికి ఒకేసారి నామినేటెడ్ పోస్టులు కేటాయిస్తారని వైసీపీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది.
పోసాని కృష్ణమురళి, అలీలు ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పోసాని చాలా కాలంగా వైసీపీలో కొనసాగుతుండగా.. అలీ 2019 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజులు ముందు వైసీపీ కండువా కప్పుకున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వారు వైసీపీ తరఫున ప్రచారంలో కూడా పాల్గొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీరికి కీలక పదవులు దక్కనున్నాయనే ప్రచారం సాగింది. పలు సందర్భాల్లో వీరద్దరికి నామినేటెడ్ పదవులు దక్కనున్నాయనే ప్రచారం జరిగింది.
ఇక, అలీ విషయానికి వస్తే.. ఆయన సీఎం జగన్ను కలిసిన తర్వాత పలు రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆయనను రాజ్యసభకు పంపుతారని వైసీపీ వర్గాల్లో కూడా జోరుగా చర్చ సాగింది. అయితే అది జరగలేదు. అలీకి ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి ఇస్తారనే వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. మరోవైపు పోసానికి కూడా ఏదో ఒక పదవి ఇవ్వనున్నారనే ప్రచారం సాగింది. కానీ అదంతా ప్రచారానికే పరిమితం అయ్యాయి. అయితే ఈ సారి మాత్రం పార్టీ కోసం పనిచేసిన నటులు పోసాని కృష్ణమురళి, అలీలకు ఒకేసారి పదవులు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలస్తోంది. మరి అలీ, పోసానిలకు పదవులు దక్కుతాయా? లేదా? అనేది కొన్ని రోజుల్లోనే తేలిపోనుంది.