Tirupati: తిరుపతిలో కొత్త టెన్షన్.. బీటలు వారుతున్న ఇళ్లు.. భయాందోళనలో స్థానికులు..
టెంపుల్ సిటీ తిరుపతిలో(Tirupati) చోటుచేసుకుంటున్న పరిణామాలు స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా శ్రీకృష్ణ నగర్లో (Sri Krishna Nagar) ఉన్నట్టుండి ఇళ్లు కుంగుతున్నాయి. ఏకంగా 18 ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి.
టెంపుల్ సిటీ తిరుపతిలో(Tirupati) చోటుచేసుకుంటున్న పరిణామాలు స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోని ప్రజలు భయపడిపోతున్నారు. భారీ వర్షాలతో తిరుపతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. అయితే వరద ముప్పు నుంచి తెరుకుంటున్న తిరుపతి ప్రజలు.. శ్రీకృష్ణ నగర్లో జరగుతున్న పరిణామాలు చూసి ఆందోళన చెందుతున్నారు. ఓ మహిళ సిమెంట్ రింగులతో చేసిన ట్యాంకును శుభ్రం చేస్తుండగా.. భూమిలో ఉన్న ఆ ట్యాంకు పైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మహిళ సల్ప గాయాలతో బయటపడింది. భూమి ఉన్న 25 రింగుల్లో 18 సిమెంట్ రింగులు భూమిపైకి రావడంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. మరో సరికొత్త టెన్షన్ నెలకొంది. శ్రీకృష్ణ నగర్లో (Sri Krishna Nagar) ఉన్నట్టుండి ఇళ్లు కుంగుతున్నాయి. ఏకంగా 18 ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. గోడలకు భారీగా బీటలు వారాయి. అయితే వాటర్ ట్యాంక్ పైకి తేలిన పరిసరాల్లోనే.. ఇళ్లు కుంగుతుండటంతో అక్కడి ప్రజలు కంటిమీద కునుకులేకుండా కాలం గడుపుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంతో వణికిపోతున్నారు.
నిపుణులు ఏమంటున్నారంటే..?
శ్రీకృష్ణానగర్లో వాటర్ ట్యాంకు పైకి వచ్చిన ఘటనను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ జియాలజి ప్రొఫెసర్స్ బృందం పరిశీలించింది. అనంతరం అసోసియేట్ ప్రొఫెసర్ మధు మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటన రాయలసీమ జిల్లాల్లో ఇదే తొలిసారి అని తెలిపారు. భూమి పొరలలో మార్పు, సంప్ నిర్మాణ సమయంలో నింపిన ఇసుక కాలువ గట్టున ఉన్న ప్రాంతం కావడం, వరద ముంపు.. వాటి వల్లే ఇలా జరిగి ఉంటుందన్నారు.
Also read: Heavy Rains in AP: ఏపీని వదలని వాన.. 29న మరో అల్పపీడనం.. ఆ జిల్లాలో స్కూల్స్కు సెలవు..
భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో..
భారీ వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే తెరుకుంటున్న ప్రజలకు ఇది నిజంగానే షాకింగ్ న్యూస్. నవంబర్ 29న అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమకు భారీ వర్ష సూచన ఉన్నట్టుగా తెలిపింది. రెండు రోజుల పాటు చిత్తూరు (Chittoor), నెల్లూరు (Nellore) జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. సుమారు 13 సెం.మీ వర్షపాతం నమోదు కావచ్చని అంచన వేసింది.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో చిత్తూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. తూర్పు ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హరిణారాయన్ సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు కాజ్వేలు దాటరాదని హెచ్చరించారు. అవసరమైన చోట పునరావాస కేంద్రాల ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్దంగా ఉండాలని ఆదేశించారు.