ఎమ్మెల్యే సుగుణమ్మ అలక.. బుజ్జగించిన సీఎం
తితిదే అధికారులు తనకు సరైన గుర్తింపు ఇచ్చేవరకు ఆలయానికి రాకూడదని నిర్ణయించుకున్నట్లు వివరించారు.
తనకు సరైన గుర్తింపు లభించడం లేదని తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ అలకబూనారు. కాగా.. ఈ విషయంలో ఏకంగా సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కబెట్టారు.
ఇంతకీ మ్యాటరేంటంటే... శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం పట్టువస్త్రాలు సమర్పించే సమయంలో ఎమ్మెల్యే గైర్హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే లేకపోవడంపై ఆరా తీసిన ముఖ్యమంత్రి.. సుగుణమ్మను పిలిచి మాట్లాడారు. మహాసంప్రోక్షణ సమయంలో తితిదే అధికారులు తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని... ఆలయంలోనికి అనుమతించని కారణంగా తాను మనస్తాపం చెందినట్లు ఆమె సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తితిదే అధికారులు తనకు సరైన గుర్తింపు ఇచ్చేవరకు ఆలయానికి రాకూడదని నిర్ణయించుకున్నట్లు వివరించారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తితిదే అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమక్షంలో ఆలయంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో తనకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి అదేశించినట్లు సుగుణమ్మ తెలిపారు.