వేసవి సెలవులు ముగుస్తుండడంతో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు.కేవలం ఒక్కరోజునే సుమారు 95 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేసవి సెలవులు, సెలవుదినాల నేపథ్యంలో ఈ రద్దీ మరింత పెరిగింది. మే 31న తిరుమలలో ఒక్క రోజే 95,080 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం కొత్త రికార్డుగా నమోదైంది. గత పదేళ్లలో ఏ ఒక్క రోజైనా ఇంత ఎక్కువ సంఖ్యలో భక్తులు శ్రీవారి సేవలో పాల్గొనడం ఇదే తొలిసారి అని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది.
రద్దీ భారీగా…
టీటీడీ సమాచారం ప్రకారం, మే 16 నుంచి తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. రద్దీ కారణంగా అన్నీ విభాగాల్లో సిబ్బంది నిరంతరం పని చేస్తున్నారు. దర్శనవ్యవస్థ నుంచి అన్నప్రసాద పంపిణీ వరకూ అన్నీ సేవలూ సమర్థంగా నిర్వహించేందుకు టీటీడీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. విజిలెన్స్, ఆలయ సిబ్బంది, అన్నప్రసాదం శాఖ సమన్వయంతో పని చేశాయి. తాగునీరు, పాలు, అన్నప్రసాదం వంటి సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా భక్తులకు అందించడం జరిగింది.
మొత్తం భక్తుల సంఖ్యలో గతేడాది మే నెలతో పోలిస్తే కూడా ఈసారి పెరుగుదల కనిపించింది. 2024 మేలో 23.23 లక్షల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకోగా, 2025 మేలో ఈ సంఖ్య 23.79 లక్షలకు పెరిగింది. అంటే గతేడాది మే తో పోల్చితే ఈ ఏడాది మే లో 55,759 మంది భక్తులు తిరుమలకు వచ్చారు.
లడ్డూ విక్రయాల్లోనూ..
అన్నప్రసాదాల విషయంలోనూ రికార్డు నమోదైంది. 2024 మేలో 71 లక్షల మందికి అన్న వితరణలు జరగగా, 2025 మేలో ఈ సంఖ్య 1.33 కోట్లకు చేరినట్లు టీటీడీ వివరించింది. ఇదే విధంగా తలనీలాల సమర్పణ, లడ్డూ విక్రయాల్లోనూ ఈసారి స్పష్టమైన పెరుగుదల కనిపించింది.
ఈ వేసవి కాలంలో భక్తుల భద్రత, సౌకర్యాల పరంగా టీటీడీ తీసుకున్న చర్యలు తిరుమలలో నిర్వహణ సాఫీగా కొనసాగేందుకు తోడ్పడ్డాయని అధికారులు చెప్పారు. రానున్న రోజుల్లో కూడా భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపడుతున్నారు.