ఏపీలో దుండగులు చెలరేగిపోయారు. 25ఎకరాల దానిమ్మతోటకు నిప్పంటించారు. దీంతో రూ.75లక్షల మేరకు ఆస్త నష్టం వాటిల్లింది. 

అనంతపురం : ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు దానిమ్మ తోటకు నిప్పు పెట్టారు. మంగళవారం రాత్రి జిల్లాలోని బొమ్మనహాల్ మండలంలోని ఏళంజి గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. మురళీకృష్ణ, రేణుక, వరలక్ష్మి, బాబురావు అనే రైతులు 27 ఎకరాల్లో దానిమ్మ సాగు చేస్తున్నారు. ఇటీవలే పంట కాపుకు కూడా వచ్చింది. ఈ క్రమంలోనే గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి తోటలోని గడ్డికి నిప్పుపెట్టారు. గడ్డికి పెట్టిన నిప్పు చెలరేగి 25 ఎకరాల్లోని తోటకు మంటలు అంటుకుని పూర్తిగా దద్దమైపోయింది.

తోట తగలబడుతున్న సంగతి గమనించిన చుట్టుపక్కలవారు వెంటనే అక్కడికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. వీరి సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది రాత్రి 9 గంటలకు రాయదుర్గం నుంచి ఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తోటలోని మొక్కలతోపాటు వ్యవసాయ బోర్లు, బిందు సేద్యం కోసం తీసుకొచ్చి పెట్టిన పరికరాలు, రెండు ట్రాన్స్ఫార్మర్లు అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. దాదాపుగా 75 లక్షల వరకు ఈ ప్రమాదం వల్ల నష్టం వాటిల్లిందని బాధితులు కన్నీరు అవుతున్నారు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో తోట దగ్గర కాపలాదారుడు ఉన్నాడు. నాలుగు రోజుల క్రితం బాధిత రైతులు హైదరాబాదుకు వెళ్లడంతో కాపలాదారు మాత్రమే అక్కడ ఉన్నాడు.

ఎన్టీఆర్ జిల్లాలో బోల్తా పడ్డ గరుఢ బస్సు.. 10మందికి తీవ్ర గాయాలు..