మూడు లాంతర్ల వివాదం: బాబాయ్, మోతిమహల్...? నిలదీసిన సంచైత గజపతి రాజు
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో చెలరేగిన వివాదాలు ఒకింత సద్దుమణిగాయి అనుకుంటున్నా తరుణంలో మూడు లాంతర్ల స్థంభం తొలగింపుతో అది మరో నూతన వివాదానికి దారితీసింది.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో చెలరేగిన వివాదాలు ఒకింత సద్దుమణిగాయి అనుకుంటున్నా తరుణంలో మూడు లాంతర్ల స్థంభం తొలగింపుతో అది మరో నూతన వివాదానికి దారితీసింది.
చంద్రబాబు నాయుడు నిన్న విజయనగరం పట్టణంలోని మూడు లాంతర్ల స్థంభం తొలిగింపు దారుణమని, చరిత్రను చెరిపేయడానికి చేస్తున్న కుట్రలో ఇది భాగమని ఆయన ట్వీట్ చేసారు. ఆయన ట్వీట్ చేయగానే అశోక్ గజపతి రాజు దాన్ని రీట్వీట్ చేస్తూ... ధన్యవాదాలు తెలిపారు.
అశోక్ గజపతిరాజు సోదరుడి కూతురు సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ సంచైత గజపతి రాజు ఈ ట్వీట్ కి రిప్లై ఇస్తూ... మూడు లాంతర్ల స్థంభం ఫోటోను జత చేస్తూ... మూడు లాంతర్ల స్తంభంపై అశోక్ గజపతి రాజు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అక్కడ పునరుద్ధరణ పనులు జరుగుతున్నందున దాన్ని తొలగించారని, ఆ పనులు పూర్తయిన తరువాత దాన్ని మరల తిరిగి అక్కడే పెడతారని అన్నారు.
మరో ట్వీట్లో అశోక్ గజపతి రాజు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్నప్పుడు 1869 నాటి మోతీ మహల్ ను పునరుద్ధరించకుండా ఎందుకు నాశనం చేసారని ఆమె ప్రశ్నించారు. దీనిపై ఆమె బాబాయి అయినా, చంద్రబాబు అయినా వివరణ ఇవ్వగలరా అని ఆమె ప్రశ్నించారు. తాతగారైన పీవీజీ రాజు గారి వారసత్వాన్ని ఎందుకు కాపాడలేకపోయారని ఆమె నిలదీశారు.