బాపట్ల జిల్లా రేపల్లే మండలం రావి అనంతవరం వద్ద శనివారం తెల్లవారుజామున ఓ లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రేపల్లే మండలం రావి అనంతవరం వద్ద శనివారం తెల్లవారుజామున ఓ లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడినవారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నాపరాళ్ల లోడ్‌లో లారీ మాచర్ల నుంచి రేపల్లే‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని గుర్తించారు. 

ఇక, ఈ ప్రమాదంలో గాయపడినవారిని ప్రస్తుతం రేపల్లే ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. మృతులను పల్నాడు జిల్లా మాచర్లకు చెందినవారిగా గుర్తించారు. లారీ డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.