ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెలి కిషోర్ బాబు, తోట చంద్రశేఖర్,  రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి తదితరులు ఇవాళ  కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. 

హైదరాబాద్: మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి తోట చంద్రశేఖర్, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి సహా పలువురు ఏపీకి చెందిన నేతలు సోమవారం నాడు రాత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. హైద్రాబాద్ కు వచ్చిన ఏపీ నేతలు భారీ వాహనాల ర్యాలీతో హైద్రాబాద్ లోని తెలంగాణ భవన్ కు చేరుకున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బీఆర్ఎస్ ఆవిర్భవించినప్పటి నుంచి పార్టీ అధిష్ఠానం ఏపీ సహా వివిధ రాష్ట్రాల నాయకులతో చర్చలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే చంద్రశేఖర్‌, కిశోర్‌బాబు, పార్థసారథి తదితరులు పార్టీలో చేరేందుకు ముందుకొచ్చారు. మహారాష్ట్ర కేడర్‌ ఐఏఎస్‌గా 23 ఏళ్లపాటు పనిచేసిన చంద్రశేఖర్‌ ఆ పదవికి రాజీనామా చేసి 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున గుంటూరు లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీఅభ్యర్థిగా ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి, 2019లో జనసేన పార్టీ తరఫున గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రావెల కిశోర్‌బాబు 2014 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున విజయం సాధించి, చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమమంత్రిగా పనిచేశారు. 2019లో ఆయన జనసేన పార్టీలో చేరి అదే నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరినా, దానికీ రాజీనామా చేశారు. చింతల పార్థసారథి ఐఆర్‌ఎస్‌ పదవికి రాజీనామా చేసి 2019లో అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు

also read:బీఆర్ఎస్‌లోకి ఏపీ నేతలు: రేపు కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి రావెల సహ పలువురి చేరిక

ఇవాళ ఉదయం మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, తోట చంద్రశేఖర్ తదితరులు తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మెన్ వినోద్ కుమార్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఏపీలో పలువురు పార్టీల నేతలతో బీఆర్ఎస్ నేతలు చర్చలు జరుపుతున్నారు. ఇతర రాష్ట్రాలతో పాటు ఏపీలో కూడా బీఆర్ఎస్ బలమైన శక్తిగా అవతరించాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే ఏపీలో ఆయా సామాజిక వర్గాల్లో బలమైన నేతలుగా ముద్రపడిన నేతలను పార్టీలోకి ఆహ్వానించింది. రానున్న రోజుల్లో కూడా మరింత మంది బీఆర్ఎస్ లో చేరుతారని కేసీఆర్ ప్రకటించారు.