ఒకప్పుడు తంబళ్లపల్లె నియోజకవర్గంలో కాంగ్రెస్ , టీడీపీలదే హవా సాగింది. ఇరు పార్టీలు చెరో ఆరు సార్లు ఇక్కడి నుంచి గెలిచాయి. ఇతరులు రెండు సార్లు, వైసీపీ ఒకసారి విజయం సాధించాయి.  

తంబళ్లపల్లె.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఈ నియోజకవర్గం దశాబ్ధాలుగా కరువు రక్కసి కబంద హస్తాల్లో చిక్కి విలవిలలాడుతోంది. దీనికి తోడు ఫ్యాక్షన్ రాజకీయాల కారణంగా తంబళ్లపల్లె అభివృద్ధి రుచిని చూడలేదు. ఆధిపత్య పోరుకు రాజకీయాలు తోడు కావడంతో ఎంతోమంది బలయ్యారు. అనంతరం పీపుల్స్ వార్ ఎంట్రీతో నక్సల్ ఉద్యమం కూడా ఇక్కడ ఉద్దృతంగా సాగింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

 ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డా :

మూడు నాలుగు దశాబ్ధాల వెనక్కి వెళితే.. అనిపిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇక్కడ తిరుగులేని నేతగా వెలుగొందారు. అయితే ఫ్యాక్షన్ గొడవల్లో ఆయనను ప్రత్యర్ధులు దారుణంగా హతమార్చారు. ఆ తర్వాత ప్రభాకర్ రెడ్డి సతీమణి లక్ష్మీదేవమ్మ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె తర్వాత కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా తెలుగుదేశం తరపున విజయం సాధించారు. తరం మారడంతో తంబళ్లపల్లెలో ఫ్యాక్షన్ గొడవలు సద్దుమణిగినా కరువు మాత్రం వీడిపోవడం లేదు. కర్ణాటక, అనంతపురం, కడప జిల్లాల సరిహద్దుల్లో వుండటంతో మూడు ప్రాంతాల కల్చర్ ఈ ప్రాంతంలో వుంది. 

1955లో తంబళ్లపల్లె నియోజకవర్గం ఏర్పాటైంది. పెద్దమండ్యం, తంబళ్లపల్లె, ములకల చెరువు, పెద్ద తిప్ప సముద్రం మండలాలు, బి.కొత్తకోట మండలంలోని ఐదు పంచాయతీలను ఈ సెగ్మెంట్‌లో విలీనం చేశారు. అయితే 2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా మదనపల్లె నియోజకవర్గంలోని కురబలకోట మండలం, బీ. కొట్టకోట మండలంలోని ఆరు పంచాయతీలను కలిపి తంబళ్లపల్లెను ఏర్పాటు చేశారు. ఇక్కడ టీఎన్, కలిచర్ల కుటుంబాలదే ఆధిపత్యం. ఆ తర్వాత అనిపిరెడ్డి ఫ్యామిలీ ఎంట్రీతో తంబళ్లపల్లె రాజకీయాలు మారిపోయాయి. 

తంబళ్లపల్లె నియోజకవర్గంలో కాంగ్రెస్ , టీడీపీల హవా సాగింది. ఇరు పార్టీలు చెరో ఆరు సార్లు ఇక్కడి నుంచి గెలిచాయి. ఇతరులు రెండు సార్లు, వైసీపీ ఒకసారి విజయం సాధించాయి. తంబళ్లపల్లెలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,09,834. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి 1,05,444 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి శంకర్ యాదవ్‌కు 58,506 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 46,938 ఓట్ల మెజారిటీతో తంబళ్లపల్లెలో తొలిసారి పాగా వేసింది. 

 జెండా ఎగురవేయాలని టీడీపీ :

2024 ఎన్నికల విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డికి వైసిపి మరోసారి టికెట్ కేటాయించారు. మంత్రి పెద్దిరెడ్డితో పాటు పార్టీ హైకమాండ్ ఆశీస్సులు పుష్కళంగా వున్నాయి. టీడీపీ విషయానికి వస్తే దాసరిపల్లె జయచంద్రారెడ్డికి చంద్రబాబు టికెట్ కేటాయించారు.