గన్నవరంలో గరం గరం.. నా భర్తకు ఏం జరిగినా సీఎం, డీజీపీలే బాధ్యులు: టీడీపీ నేత పట్టాభి భార్య ఆందోళన
గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడి చేయడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. దాడి జరిగిన విషయం తెలుసుకొని పార్టీ నేత పట్టాభిరామ్ గన్నవరం చేరుకున్నారు. కానీ, ఆయనను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏపీ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలో టీపీడీ కార్యాలయంలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. స్థానిక టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడి చేయడం, టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కారును ఆందోళనకారులు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా.. ఎమ్మెల్యే వంశీపై విమర్శలు చేసిన దొంతు చిన్నా కారుకు నిప్పుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు, నేతలు పార్టీ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. గన్నవరం రాకుండా.. టీపీడీ నేతలకు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో దాడి జరిగిన విషయం తెలుసుకొని పార్టీ నేత పట్టాభిరామ్ గన్నవరం బయలుదేరారు. ఈ క్రమంలో పట్టాభిరామ్ ను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఆయనను ఏటు తరలించారనేదనిపై స్పష్టత లేదు. అదే సమయంలో గన్నవరం బయలుదేరిన మాజీ మంత్రి దేవినేని ఉమాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో గన్నవరంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
నా భర్తకు ఏం జరిగినా సీఎం, డీజీపీదే బాధ్యత - పట్టాభిరామ్ భార్య
ఈ నేపథ్యంలో పట్టాభి రామ్ భార్య చందన మీడియా ముందుకు వచ్చి..తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘టీడీపీ కార్యాలయంపై దాడి విషయం తెలిసి నా భర్త(పట్టాభి రామ్) గన్నవరం కార్యాలయానికి వెళ్లారు. అక్కడికి వెళ్లిన ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నా భర్తను ఎక్కడికి తీసుకెళ్లారనే విషయం తెలియరావడం లేదు. ఆయన ఫోన్ స్విచాఫ్ వస్తోంది, ఏం జరిగినా సీఎం, డీజీపీదే బాధ్యత ’’ అని పట్టాభి భార్య చందన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యంలో భౌతికదాడి హేయమైన చర్య: సోము వీర్రాజు
ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు పాల్పడటం సరికాదనీ, అది హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్నాయి. జగన్ పాలనలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని విమర్శించారు. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.