ఎన్టీఆర్ ఫోటోతో కేంద్ర ప్రభుత్వం రూ.100 నాణెం రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే అతిథుల జాబితాలో తన పేరు లేకపోవడంతో ఎన్టీఆర్ సతీమణి, తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అసంతృప్తి వ్యక్తం చేశారు.

టీడీపీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు స్మారకార్ధం కేంద్ర ప్రభుత్వం రూ.100 నాణెం విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎన్టీఆర్ సతీమణి, తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి లేఖ రాశారు. అతిథుల జాబితాలో తన పేరు కూడా చేర్చాలని విజ్ఞప్తి చేశారు. కేవలం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఇతర కుటుంబ సభ్యులను మాత్రమే పిలవడంపై లక్ష్మీపార్వతి అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ఎన్టీఆర్ భార్యగా తానే అసలైన వారసురాలినని లక్ష్మీపార్వతి లేఖలో పేర్కొన్నారు. ఇదే సమయంలో ఎన్టీ రామారావు పేరుపై రూ.100 నాణెం విడుదల చేస్తున్నందుకు ఆమె కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు తదితర కుటుంబ సభ్యుల వల్ల ఎన్టీఆర్ చనిపోయారని.. అలాంటి వ్యక్తులను నాణెం విడుదల కార్యక్రమానికి పిలవడంపై లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ నెల 28న ఎన్టీఆర్ చిత్రం వున్న రూ.100 నాణెంను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేయనున్నారు. చారిత్రక ఘటనలు, ప్రముఖల గుర్తుగా నాణెలను విడుదల చేస్తుంటారు. 1964 నుండి ఇలా నాణెల విడుదల చేయడం ప్రారంభించారు.తొలుత నెహ్రు స్మారకార్ధం నాణెం విడుదల చేశారు. మాజీ ప్రధాని వాజ్ పేయ్ చిత్రంతో కూడా నాణెం విడుదల చేసిన విషయం తెలిసిందే.