తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు నేటి వరకు ఏపీ ప్రభుత్వం ఎలాంటి పోస్ట్ కేటాయించకపోవడంతో సోమేశ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)కు సోమేశ్ దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల తెలంగాణ హైకోర్ట్ తీర్పుతో సోమేశ్ కుమార్ ఏపీ కేడర్కు వెళ్లిన సంగతి తెలిసిందే. న్యాయస్థానం ఆదేశాలతో ఏపీ సీఎస్ను కలిసిన సోమేశ్ కుమార్ జాయినింగ్ రిపోర్ట్ అందజేశారు. అయితే నేటి వరకు సోమేశ్కు ఏపీ ప్రభుత్వం ఎలాంటి పోస్ట్ కేటాయించకపోవడంతో ఆయన వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నట్లుగా ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.
మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ను తెలంగాణ క్యాడర్ నుంచి రిలీవ్ చేసి.. జనవరి 12 లోపు ఆంధ్రప్రదేశ్ కేడర్లో చేరాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోమేష్ కుమార్ ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేశారు. అలాగే సీఎస్ జవహర్ రెడ్డి, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిలను సైతం కలిశారు.
Also REad: వీఆర్ఎస్ కు తొందరలేదు: మాజీ తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్
ఇక, సోమేశ్ కుమార్ 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఏపీలో పలు బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో జీహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత గిరిజిన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. 2019 డిసెంబర్ 31న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎక్కువ కాలం పనిచేసిన సీఎస్గా ఉన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ విభజన సందర్భంగా తన సీనియారిటీ ప్రకారం తాను ఆప్షన్ ఇచ్చిన తెలంగాణకు కాకుండా ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ సోమేశ్ కుమార్ 2014లో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే సీఎస్ సోమేశ్ కుమార్ తెలంగాణలోనే కొనసాగేలా క్యాట్ తీర్పు ఇచ్చింది. అయితే క్యాట్ ఆర్డర్ను నిలిపివేయాలని కోరుతూ డీవోపీటీ 2016 మార్చిలో తెలంగాణ హైకోర్టులో రిట్ అప్పీల్ దాఖలు చేసింది. డీవోపీటీ దాఖలు చేసిన రిట్ అప్పీల్ను విచారించిన చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్ నందాతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది.
