సారాంశం

కాకినాడ జిల్లా పెద్దాపురం టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. టీడీపీ, వైసీపీ నేతలు బహిరంగ చర్చ కోసం మున్సిపల్ సెంటర్‌కు బయలుదేరగా పోలీసులు వారిని వారి పార్టీ కార్యాలయాల  వద్దే అడ్డుకుంటున్నారు. 
 

కాకినాడ జిల్లా పెద్దాపురం టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఎవరి హయంలో అవినీతి జరిగిందనే అంశంపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ దొరబాబుల నేతలు పరస్పరం సవాళ్లు చేసుకున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ, టీడీపీ నేతలు.. లై డిటెక్షన్ టెస్టు, బహిరంగ చర్చ కోసం మున్సిపల్ సెంటర్‌‌కు వెళ్లేందుకు బయలుదేరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బారీగా బలగాలను మోహరించారు. టీడీపీ కార్యాలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులకు, పోలీసులకు వాగ్వాదం చోటుచేసుకుంది. 

ఇక, టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కూడా పార్టీ కార్యాలయంలోనే ఉన్నారు. తమపై అవనసరంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. అధికారంలో ఉన్న వైసీపీ తమ హయాంలో అవినీతి జరిగి ఉంటే నిరూపించవచ్చని అన్నారు. మున్సిపల్ సెంటర్‌కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరుతున్నారు. తాము తప్పకుండా మున్సిపల్ సెంటర్‌కు చేరుకుంటామని టీడీపీ నేతలు చెబుతున్నారు. 

మరోవైపు మున్సిపల్ సెంటర్ వైపు వెళ్లేందుకు యత్నించిన వైసీపీ శ్రేణులను కూడా పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ  నేతలను కూడా వారి పార్టీ కార్యాలయానికే పరిమితం చేసేలో బందోబస్తు ఏర్పాటు  చేశారు. ఇక, టీడీపీ, వైసీపీ శ్రేణులు మున్సిపల్ సెంటర్‌కు చేరుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా ఇరువర్గాల ఎలాంటి  కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా అదనపు బలగాలను కూడా పెద్దాపురంకు రప్పించారు. దీంతో పెద్దాపురంలో ఎప్పుడూ ఏం జరుగుతుందోననే హై టెన్షన్ వాతావరణం  నెలకొంది. 

ఇక, నిమ్మకాయల చినరాజప్ప, దొరబాబుల మధ్య కొంతకాలంగా మాటల యుద్దం కొనసాగుతుంది. ఒకరిపై ఒకరు ఘాటైన విమర్శలు చేసుకోవడంతో పాటు.. పలు ఆరోపణలు సంధించుకుంటున్నారు. తమ ప్రభుత్వంలో అభివృద్ది జరిగిందంటే.. కాదు తమ ప్రభుత్వంలోనే అభివృద్ది జరిగిందంటూ బహిరంగ సవాళ్లకు దిగారు. 

దొరబాబుకు అభివృద్ది చేయాలనే ఆలోచన లేదని.. అభివద్ది పనులకు అడ్డుపడుతున్నారని నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. అక్రమ మైనింగ్, మట్టి మాఫియాకు, గ్రావెల్ తవ్వకాలకు దొరబాబు అండగా ఉంటున్నారని ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే దొరబాబు కూడా అదే స్థాయిలో స్పందించారు. ఎవరి ప్రభుత్వంలో అవినీతి జరిగిందో బహిరంగ చర్చకు సిద్దమని దొరబాబు ప్రకటించారు. పెద్దాపురం మున్సిపల్ సెంటర్‌లో ఇద్దరం లై డిటెక్టర్ టెస్టు చేయించుకుంటే.. ఎవరూ చెబుతుంది వాస్తవమనేది ప్రజలు తెలుస్తుందని చినరాజప్పకు సవాలు విసిరారు. తన నిజాయితీ రుజువు కాకపోతే ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా  చేస్తానని.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని చెబుతున్నారు. మరోవైపు  లై డిటెక్టర్ టెస్టుకు తాను సిద్దమని చినరాజప్ప ప్రకటించారు.