కొండెపిలో ఢీ అంటే డీ అంటున్న వైసీపీ, టీడీపీ.. పోలీసులు అదుపులో ఎమ్మెల్యే.. నియోజకవర్గంలో హై టెన్షన్..
ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గంలో వైసీపీ-టీడీపీ శ్రేణులు ఢీ అంటే ఢీ అంటున్నాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గంలో వైసీపీ-టీడీపీ శ్రేణులు ఢీ అంటే ఢీ అంటున్నాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి ఇంటి ముట్టడికి వైసీపీ పిలుపునిచ్చింది. కొండెపి వైసీపీ ఇంచార్జ్ అశోక్ బాబు ఈ మేరకు పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు. గతంలో టీడీపీ హయాంలో స్వచ్ఛభారత్ నిధులను ఎమ్మెల్యే వీరాంజనేయస్వామి దుర్వినియోగం చేశారని వైసీపీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే చలో తూర్పు నాయుడుపాలెం అంటూ ఎమ్మెల్యే వీరాంజనేయస్వామి ఇంటి ముట్టడికి యత్నించింది. అయితే వైపీసీ నిరసనలకు కౌంటర్గా చలో టంగుటూరుకు టీడీపీ పిలుపునిచ్చింది. అయితే ఈ క్రమంలోనే ఇరు పార్టీల నేతలు.. వారి కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్దమయ్యారు.
వైసీపీ నేత అశోక్ బాబు తీరును నిరసిస్తూ ఈరోజు ఉదయం నాయుడుపాలెం నుంచి టంగుటూరుకు ర్యాలీ బయలుదేరారు. వారితో పాటు ఎమ్మెల్యే వీరాంజనేయస్వామి కూడా ఉన్నారు. అయితే కొంతదూరం ముందుకు కదిలిన టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు తమను ఎందుకు అడ్డుకుంటున్నారని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు తాము బెదిరేది లేదని టీడీపీ నాయకులు చెబుతున్నారు. దీంతో కొండెపి నియోజకవర్గంలో ఎప్పుడూ ఏం జరుగుతుందనే హై టెన్షన్ నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే వీరాంజనేయస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.