Kuppam Municipal Election: కుప్పంలో దొంగఓట్ల కలకలం... రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ కడప యువకులు
కుప్పం మున్సిపాలిటీతో పాటు అనంతపురం జిల్లా పెనుగొండ నగర పంచాయతీ, విశాఖలోని రెండు డివిజన్లలో జరిగిన ఉపఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.
చిత్తూరు: కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో దొంగఓట్లు కలకలం సృష్టించాయి. పోలింగ్ సందర్భంగా ఇతరప్రాంతాల నుండి వచ్చిన కొందరు అనుమానాస్పదంగా వివిధ పోలింగ్ కేంద్రాలవద్ద తచ్చాడుతుండగా గుర్తించి నిలదీయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే కొందరు దొంగఓట్లు వేయడానికి ప్రయత్నించగా పోలింగ్ కేంద్రాల్లోని ఏజెంట్లు గుర్తించారు. ఇలా 18, 19వార్డుల్లో దొంగ ఓట్లు వేస్తుండగా గుర్తించి పోలీసులకు అప్పగించారు.
అయితే ఇలా Kuppam Municipal Election లో దొంగఓట్లు వేయడానికి ప్రయత్నించింది కడప జిల్లా రాయచోటికి చెందిన యువకులుగా గుర్తించారు. దీంతో ysrcp నాయకులే వీరిని దొంగఓట్లు వేయించడానికి తీసుకువచ్చారని TDP నాయకులు ఆరోపిస్తున్నారు. దొంగఓట్లు వేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అప్పగించినా పోలీసులు విడిచిపెట్టారంటూ టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు కుప్పంలోని కొత్తపేట జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. ఓటర్లు కానివారికి వైసిపి స్లిప్పులు ఇస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు నిరసన తెలియజేశాయి. దీంతో ఇరుపార్టీల మధ్య ఘర్షణ వాతావరణం రేగడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఓ పోలింగ్ కేంద్రం వద్ద దొంగ ఓటు వేసేందుకు వచ్చిన ఓ మహిళను టిడిపి కార్యకర్తలు అడ్డుకుని ప్రశ్నించారు.
READ MORE Chandrababu Naidu: పోలీసుల పని ప్రజలు చేయాలా?.. చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదు.. చంద్రబాబు నాయుడు ఫైర్
ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థినైన తననే పోలింగ్ బూత్ లోకి రానివ్వకుండా అడ్డుకుంటారా అంటూ 16వార్డు అభ్యర్టి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆయనకు అక్కడేవున్న టిడిపి శ్రేణులు తోడవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమను పోలింగ్ బూత్ లోకి వెళ్లనివ్వకుండా పోలీసులు తరిమేస్తున్నారంటూ టీడీపీ అభ్యర్థితో పాటు జనరల్ ఏజెంట్ ఆరోపించారు.
టీడీపీ మాజీ ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు, ఎంపి రెడ్డప్ప ఘటనా స్థలానికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు బలగాలను మరింత మోహరించారు.
వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ కుప్పంలోని పూలమార్కెట్ వద్ద టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. పోలీసులు అధికార వైసిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టిడిపి శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
READ MORE Kuppam Election: బాబాయ్ని గొడ్డలి పోటులాగే... ప్రజాస్వామ్యంపై దొంగఓట్ల వేటు: లోకేష్ ఆగ్రహం
మరోవైపు అనంతపురం జిల్లా పెనుగొండ నగర పంచాయతీ పోలింగ్లోనూ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రయత్నించగా అక్కడే ఉన్న టిడిపి మాజీ ఎమ్మెల్యే పార్థసారథి అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసులు వారికి సర్దిజెప్పి అక్కడి నుంచి పంపించారు.
విశాఖలో వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య గొడవ
విశాఖపట్నంలోని 31వ డివిజన్ ఉప ఎన్నికలోనూ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రేమ సమాజం స్కూల్లో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ వద్ద వైసీపీ, జనసేన కార్యకర్తలు మధ్య గొడవ జరిగింది. పెద్ద సంఖ్యలో అక్కడికి ఇరు పార్టీల కార్యకర్తలు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఇరుపార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. దీంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇరు వర్గాలకు నచ్చజెప్పి అక్కడి నుండి పంపించారు.