పట్టాభిని అరెస్టు చేశారా? లేదా కిడ్నాప్ చేశారా?: చంద్రబాబు
గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ నేతలు దాడి చేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఈమేరకు నిందితులను శిక్షించాలనంటూ డీజీపీకి లేఖ రాశారు.
గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేసి, కారుకు నిప్పు పెట్టిన ఘటనపై ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు. ఆ దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మార్చుతున్న జగన్ ఆ మంటల్లో కాలిపోవడం ఖాయమని పేర్కొన్నారు. వైసీపీ ఉన్మాదులు అరాచకాలు చేస్తుంటే పోలీసులు ఏ గాడిదలు కాస్తున్నారని చంద్రబాబు నిలదీశారు.
ఈ క్రమంలో హింసాత్మక ఘటనలపై చంద్రబాబు నాయుడు.. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఫిర్యాదు చేస్తూ.. లేఖ రాశారు. టీడీపీ నేతలు పట్టాభి, దొంతు చిన్నాకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ గూండాలకు పోలీసులు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ఉన్మాదులు అరాచకాలు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని చంద్రబాబు నిలదీశారు. పోలీసుల మౌనం వల్లనే ఈ దాడి జరిగిందని పేర్కోన్నారు.
పార్టీ కార్యాలయ సామగ్రి ధ్వంసం చేసి కార్లకు నిప్పుపెట్టారనీ, పార్టీ నేత దొంతు చిన్నాకు చెందిన పలు వాహనాలకు నిప్పు పెట్టారని ఫిర్యాదు చేశారు. సీనియర్ నేత పట్టాభిని కొందరు వ్యక్తులు అపహరించారని ఊహాగాహానాలు వస్తున్నాయనీ.. అసలు పట్టాభిని పోలీసులు అరెస్టు చేశారా? లేదా ఎవరైనా కిడ్నాప్ చేశారా?’’ అని చంద్రబాబు తన లేఖలో ప్రశ్నించారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పోలీస్ శాఖను మూసేశారా? వైసీపీలో విలీనం చేశారా?: చంద్రబాబు
అంతకుముందు ట్వీట్టర్ వేదికగా చంద్రబాబు స్పందించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ నేతలు దాడి చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఆఫీస్ దాడి, వాహనాలను తగలబెట్టిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాని అన్నారు. రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మారుస్తున్న వైసీపీ ప్రభుత్వం ఆ మంటల్లో కాలిపోవడం ఖాయమని హెచ్చరించారు.
వైసీపీ నేతలు అరాచకాలు చేస్తుంటే పోలీసులు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేశారన్నారు. పోలీసు శాఖను మూసేశారా? లేక వైసీపీలో విలీనం చేశారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వానికి ఈ ఘటనలే ఉదాహరణ అని అన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. ఈ దాడి చేసిన వారిపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.