సీఆర్డీఏ రద్దు, ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లులు చర్చించొద్దు: మండలి ఛైర్మెన్ షరీఫ్ కు టీడీపీ నోటీసు
సీఆర్డీఏ రద్దు, ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లులు మండలి ముందుకు వచ్చినట్టుగా ఛైర్మెన్ ఎంఏ షరీఫ్ బుధవారం నాడు ప్రకటించారు. బడ్జెట్ పై చర్చ తర్వాత ఈ బిల్లులపై చర్చించేందుకు అవకాశం ఇస్తామన్నారు.
అమరావతి: సీఆర్డీఏ రద్దు, ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లులు మండలి ముందుకు వచ్చినట్టుగా ఛైర్మెన్ ఎంఏ షరీఫ్ బుధవారం నాడు ప్రకటించారు. బడ్జెట్ పై చర్చ తర్వాత ఈ బిల్లులపై చర్చించేందుకు అవకాశం ఇస్తామన్నారు.
షెడ్యూల్ సమయం కంటే 11 నిమిషాలు ఆలస్యంగా ఏపీ శాసనమండలి ప్రారంభమైంది. శాసనమండలి సమావేశం ప్రారంభం కాగానే సీఆర్డీఏ రద్దు బిల్లు, ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లులు మండలి ముందుకు వచ్చినట్టుగా మండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్ ప్రకటించారు.
ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటికి పంపాలని గతంలోనే మండలి తీర్మానం చేసిన విషయాన్ని టీడీపీ సభ్యులు ప్రకటించారు. వికేంద్రీకరణ బిల్లులపై చర్చించకూడదని రూల్ 90 కింద టీడీపీ సభ్యులు శాసనమండలి ఛైర్మెన్ కు నోటీసులు ఇచ్చారు.
గతంలోనె ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటిని ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టులో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని టీడీపీ సభ్యులు గుర్తు చేస్తున్నారు.197 నిబంధన కింద శాసనమండలిలో ఈ రెండు బిల్లులను ప్రవేశ పెట్టడం సరైంది కాదని టీడీపీ ఎమ్మెల్సీలు అభిప్రాయపడుతున్నారు.
నిబంధనలకు విరుద్దంగా ఈ రెండు బిల్లులను శాసనమండలిలో ప్రవేశపెట్టారని టీడీపీ ఆరోపిస్తోంది. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసమండలిలో చర్చించకూడదని రూల్ 90 నిబంధన కింద టీడీపీ సభ్యులు నోటీసు ఇచ్చారు.