జనం అల్లాడుతుంటే, జగన్ సేదతీరుతున్నారు: రాజేంద్రప్రసాద్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు.
విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఆంధ్రప్రజలు జగన్ చేసిన లక్ష కోట్ల అవినీతిని మరిచిపోలేదని, ఓడిపోతామని తెలిసే ఎన్నికలు ముగిసి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు జగన్ ఆంధ్ర గడ్డపై కాలుపెట్టలేదని విమర్శించారు.
ఓ వైపు ప్రజలు తాగు, సాగునీటి కోసం అల్లాడుతుంటే లోటస్పాండ్లో కూర్చొని సేదతీరుతున్నారని రాజేంద్రప్రసాద్ ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలు జగన్కు పట్టవనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని వైవీబీ ప్రశ్నించారు.
ప్రధాని మోడీ ఓటమి భయంతోనే చంద్రబాబును విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఓడిపోయిన ఆటగాడే రిఫరీని తప్పుబడతాడంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు వ్యవస్థలపై పోరాడుతున్నారు తప్పించి.. వ్యక్తులపై కాదని రాజేంద్ర ప్రసాద్ గుర్తు చేశారు.
వేల కోట్లు ఖర్చు పెట్టి వీవీ ప్యాట్లు తీసుకువచ్చిన ఎన్నికల సంఘం.. వాటిలో ఏర్పాటు చేసిన స్లిప్పులను లెక్కించడానికి ఎందుకు సందేహిస్తుందో అర్ధం కావడం లేదన్నారు. ఈ నెల 23 తర్వాత దేశ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పడం ఖాయమని రాజేంద్రప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు.