మాతో వ్యవహరించినట్టు జూడాలతో వద్దు...: జగన్ సర్కార్ ను కోరిన లోకేష్
తమ డిమాండ్లు నెరవేర్చకపోతే దశలవారీగా సమ్మెకు దిగుతామని జూడాలు ప్రభుత్వానికి ముందుగానే తెలియజేసినా స్పందించకపోవడం విచారకరమని నారా లోకేష్ అన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్(జూడా) ప్రభుత్వం ముందుంచిన ప్రధానమైన నాలుగు డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే దశలవారీగా సమ్మెకు దిగుతామని జూడాలు ప్రభుత్వానికి ముందుగానే తెలియజేసినా స్పందించకపోవడం విచారకరమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా జూడాల డిమాండ్లన్నీ తక్షణమే నెరవేర్చాలని లోకేష్ సూచించారు.
''జూడాల ప్రధానమైన డిమాండయిన ఫ్రంట్లైన్ వర్కర్స్ అందరికీ ఆరోగ్యబీమా, మరణించేవారికి ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. అలాగే కోవిడ్ విధుల్లో వున్న పీజీలకు, హౌస్సర్జన్లకు కూడా కోవిడ్ ఇన్సెంటివ్ ఇవ్వాలని పేర్కొన్నారు. వైద్యులు, సిబ్బందిపై దాడులు జరగకుండా ఆస్పత్రులలో భద్రత పెంచి రక్షణ కల్పించాలని కోరారు.స్టైఫండ్ నుంచి టీడీఎస్ కటింగ్ పూర్తిగా ఎత్తివేయాలన్న జూడాల డిమాండ్లను నెరవేర్చాలని లోకేష్ జగన్ సర్కార్ ను కోరారు.
read more జగన్ ట్యాక్స్ వసూళ్లు రూ.30వేల కోట్లే పెట్టుబడులా..?: మంత్రి మేకపాటిపై లోకేష్ సెటైర్లు
''కోవిడ్ ఫస్ట్ వేవ్ నుంచి తమ ప్రాణాలు పణంగా పెట్టిన వైద్యులు ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. సెకండ్ వేవ్లోనూ తిండి, నిద్రకు దూరమై శ్రమించి మరీ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వైద్యులే ముందుండి పోరాడుతున్నారు. పీజీ, హౌస్సర్జన్లు కూడా కోవిడ్ విధులు నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ప్రజలతోనూ, ప్రతిపక్షంతోనూ వ్యవహరించినట్టు ప్రభుత్వం జూనియర్ డాక్టర్ల పట్ల వ్యవహరించకుండా న్యాయబద్ధమైన కోరికలు తీర్చి సమ్మె ప్రమాదాన్ని నివారించాలని కోరుతున్నా'' అని లోకేష్ పేర్కొన్నారు.
ఇక ఇవాళ(బుధవారం జూనియర్ డాక్టర్లతో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. జూనియర్ వైద్యులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి చర్చలు జరిపారు. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నట్లు జూడాలు తెలిపారు.