మంత్రి అవంతి... భూకబ్జాల్లో గొప్ప వేదాంతి: ఎమ్మెల్సీ మంతెన సెటైర్లు
వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి పోటీపడి మరీ విశాఖలో భూకబ్జాలకు పాల్పడుతున్నారని టీడీపీ శాసనమండలి సభ్యులు మంతెన సత్యనారాయణ రాజు ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నం టీడీపీ నేతల ఆస్తుల్ని లాక్కుంటూ వారిపైనే అక్రమ కేసులు పెట్టి వేధించడం సిగ్గుమాలిన చర్య అని టీడీపీ శాసనమండలి సభ్యులు మంతెన సత్యనారాయణ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని అనుమతులున్నా సరే మాజీ ఎంపీ సబ్బం హరి ప్రహరీ కూల్చారు, గీతం యూనివర్సిటీ గోడను కూల్చారు, ఫ్యూజన్ హోటల్ కి కాలపరిమితి ఉన్నా కూడా అక్కడ నుంచి అర్ధ రాత్రి ఖాళీ చేయించారు అని గుర్తుచేశారు. వైసీపీ ప్రబోబాలకు లొంగకుండా టీడీపీలొనే ఉన్నారన్న కక్షతో ఇప్పుడు వెలగపూడి రామకృష్ణ బాబుని వేధిస్తున్నారని అన్నారు.
''ఓవైపు విశాఖలో వైసీపీ నేతలు భూకబ్జాలు చేస్తూ మరోవైపు టీడీపీ నేతలపై వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టడం సిగ్గుచేటు. విశాఖలో మంత్రి అవంతి అరాచకాలు అడ్డులేకుండా పోయింది... అరగంటకొక దౌర్జన్యం, గంటకొక భూకబ్జాగా సాగుతోంది. నగరంలో జరిగే భూకబ్జాలలో 90 శాతం మంత్రి అవంతి శ్రీనివాసరావు కసుసన్నల్లోనే జరుగుతున్నాయి. విశాకలో జగదాంబ సెంటర్ నుంచిఆర్కే బీచ్ వరకు ఏ వీధిలో చూసినా అవంతి భూకబ్జాల గురించే మాట్లాడుకుంటున్నారు'' అని ఆరోపించారు.
''కరోనా టైమ్ లో అన్ని ప్రాంతాల్లోని విద్యార్థులు ఆన్లైన్ లో పాఠాలు వింటుంటే విశాఖలోని విద్యార్థులు మాత్రం ప్రజలు చెప్పుకుంటున్న అవంతి భూకబ్జాల పాఠాలు వింటున్నారు. విశాఖలో ఉన్న సముద్రం కంటే విశాఖలో అవంతి చేసిన కబ్జాలే ఎక్కువగా ఉన్నాయి. అవంతి భూకబ్జాల్లో గొప్ప వేదాంతిగా మారారు'' అని మండిపడ్డారు.
''వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి పోటీపడి మరీ విశాఖలో భూకబ్జాలకు పాల్పడుతున్నారు. వీక్లీ వైజ్ గా టార్గెట్ పెట్టుకుని వారంలో ఎవరెన్ని కబ్జాలు చేస్తున్నారో లెక్కేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి వీరిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు'' అని మంతెన నిలదీశారు.