కుప్పంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య సవాళ్లతో రాజకీయ వాతావరణం వెడేక్కింది.
కుప్పంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య సవాళ్లతో రాజకీయ వాతావరణం వెడేక్కింది. కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల పర్యటించారు. చంద్రబాబు పర్యటన టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. చంద్రబాబు పర్యటన ముగిసిన వెంటనే కుప్పం నియోజకవర్గం పరిధిలో వైసీపీ దూకుడు పెంచింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పల్లెబాట నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై పెద్దిరెడ్డి విమర్శలు గుప్పించారు. కుప్పంకు చంద్రబాబు చేసిందేమి లేదని విమర్శించారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు హంద్రీనీవా నీళ్లు తీసుకురాలేదని అన్నారు. దొంగ ఓట్లు తీసేస్తే ఈసారి కుప్పంలో చంద్రబాబు చంద్రబాబు 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోతారని అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడుకు నియోజకవర్గానికి ఒక్కసారి కూడా రాలేదని.. ఇప్పుడు జగన్ భయానికి అనేక సార్లు నియోజకవర్గానికి వస్తున్నారని ఎద్దేవా చేశారు.
అయితే పెద్దిరెడ్డి విమర్శలపై టీడీపీ కూడా ధీటుగా స్పందించారు. కుప్పం అభివృద్దిపై చర్చకు రావాలని పెద్దిరెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సవాలు విసిరారు. కుప్పంలో ఎవరు ఎంత అభివఋద్ది చేశారనే దానిపై బహిరంగ చర్చకు రావాలని అన్నారు. చంద్రబాబు కుప్పంలో 30 వేల ఓట్లతో ఓడిపోతారని పెద్దిరెడ్డి అంటున్నారని.. అలా ఓడిపోతే ఇక్కడున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరం నియోజకవర్గం వదిలి వెళ్లిపోతామని అన్నారు. అదే వైసీపీ ఓడిపోతే.. వైసీపీ ఓడిపోతే మీరు కుప్పంలో కాలుపెట్టకుండా ఉంటారా? అని సవాలు విసిరారు.
ఇక, గత ఎన్నికల్లో 151 సీట్లలో విజయం సాధించిన అధికారంలో వచ్చిన వైసీపీ.. ఈ సారి మొత్తం 175 స్థానాల్లో విజయం సాధించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ కూడా వై నాట్ 175 అనే నినాదాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలపై వైసీపీ అధిష్టానం ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంపై కూడా ప్రత్యేకంగా తీసుకుని.. వచ్చే ఎన్నికల్లో అక్కడ విజయం సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలను అమలు చేస్తోంది.
