జైలు సాయిరెడ్డి వైసీపీని ముంచేస్తారు, మే 23 తర్వాత వైసీపీ వుండదు: బుద్ధా
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. విజయవాడలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ లక్ష కోట్లు ఎలా దోచుకోవాలో నేర్పి, ఆయనను జైలుకు పంపిన ఘనత విజయసాయిరెడ్డిదేనని అన్నారు.
మే 23 తర్వాత వైసీపీ మట్టికరిచిపోవడం ఖాయమని బుద్ధా జోస్యం చెప్పారు. విజయసాయివల్ల జగన్కు నష్టమే తప్ప లాభం లేదని వెంకన్న ఎద్దేవా చేశారు. సీఏగా విజయసాయిరెడ్డిని ఇన్స్టిట్యూట్ నుంచి తొలగించారని దుయ్యబట్టారు.
తిరుమల శ్రీవారి వస్తువులపై విజయసాయిరెడ్డి కన్నుపడిందని అందుకే శ్రీవారి వస్తువులు చేజారిపోయాయని గగ్గోలు పెడుతున్నారని వెంకన్న ఆరోపించారు. జైలు జీవితంలో సహకరించాడని విజయసాయిరెడ్డికి జగన్ రాజ్యసభ సీటు ఇచ్చారని... ఆయన విజయసాయిరెడ్డి కాదని.. జైలు సాయిరెడ్డిగా మారిపోయారని వెంకన్నఆరోపించారు.