చంద్రబాబు ప్రాణాలపై ఆందోళన... కుట్రలో భాగంగానే...: బుద్దా సంచలనం
ప్రస్తుతం జగన్ సీబీఐ ఆఫీస్ ల చుట్టూ తిరుగుతున్నారని... తనలాగే చంద్రబాబు ను సీఐడి ఆఫీసులు చుట్టూ తిప్పాలని ఉద్దేశ్య పూర్వకంగా సీఐడి నోటీసులు జారీ చేశారని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు.
విజయవాడ: మాజీ సీఎం, తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రాణాలకు రక్షణ లేదని... దీనిపై తమకు ఆందోళన ఉందన్నారు టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కావాలనే వైసిపి ప్రభుత్వం భద్రత తగ్గించిందన్నారు. దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలని వెంకన్న డిమాండ్ చేశారు.
ప్రస్తుతం జగన్ సీబీఐ ఆఫీస్ ల చుట్టూ తిరుగుతున్నారని... తనలాగే చంద్రబాబు ను సీఐడి ఆఫీసులు చుట్టూ తిప్పాలని ఉద్దేశ్య పూర్వకంగా నోటీసులు జారీ చేశారన్నారు. చంద్రబాబు ను మానసికంగా, బౌతికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని కోర్టే చెప్పిందని గుర్తుచేశారు. అధికార దాహంతోనే చంద్రబాబు కు సీఐడి నోటీసులు ఇచ్చారని బుద్దా అన్నారు.
read more చంద్రబాబు మెడకు అమరావతి భూములు: ఏపీ సిఐడి నోటీసులు జారీ
''జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. మళ్ళీ చంద్రబాబు కు ప్రజలు ఓటు వేస్తారని ఆయనకు భయం పట్టుకుంది. అందువల్లే తన మంత్రులతో అసభ్య పదజాలంతో చంద్రబాబు ను తిట్టిస్తున్నారు. పుర ఎన్నికల్లో 50శాతం ప్రజలు జగన్ కు భయపడి ఓటు వేయలేదు. డబ్బు, అధికారం, పోలీసులు వల్లే వైసిపి అభ్యర్థులు గెలిచారు. అది నవరత్నాలు గెలుపు కాదు మూడు రత్నాలు గెలుపు మాత్రమే'' అని వెంకన్న మండిపడ్డారు.
''చంద్రబాబుకు సీఐడి నోటీసులు జారీ చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని ముక్త ఖంఠంతో ఖండించాలి. దీనిపై ప్రజల్లోకి వెళతాం... ఆందోళనలు చేస్తాం'' అని బుద్దా వెంకన్న హెచ్చరించారు.