నేను వంగవీటి రంగాను చంపానా .. దమ్ముంటే నిరూపించు : ఎంపీ ఎంవీవీకి వెలగపూడి సవాల్
తనపై విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేసిన ఆరోపణలకు కౌంటరిచ్చారు టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబు . ఎంపీ ఎంవీవీ భూ భక్షకుడని, ఓ దిక్కుమాలిన బిల్డర్ అంటూ వెలగపూడి రామకృష్ణ బాబు ఫైర్ అయ్యారు . తాను నీ వెంట్రుక పీకలేనని అన్నావని.. ప్రజలే నిన్ను ఎన్నికల్లో సముద్రంలో పడేస్తారని రామకృష్ణబాబు జోస్యం చెప్పారు.
విశాఖలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబుపై వైసీపీ నేత, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా తనపై చేసిన ఆరోపణలకు వెలగపూడి కౌంటరిచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దమ్ముంటే వంగవీటి మోహనరంగా కేసును రీ ఓపెన్ చేయించి, తాను హత్య చేసినట్లు నిరూపించగలవా అంటూ మండిపడ్డారు. తాను హత్య చేసినట్లు నిరూపించగలవా అంటూ ఎంవీవీ సత్యనారాయణకు సవాల్ విసిరారు. న్యాయస్థానం కొట్టేసిన కేసులో ఆరోపణలు చేసినందుకు పరువు నష్టం దావా వేస్తానని.. ఎంపీ ఎంవీవీ భూ భక్షకుడని, ఓ దిక్కుమాలిన బిల్డర్ అంటూ వెలగపూడి రామకృష్ణ బాబు ఫైర్ అయ్యారు.
ఎమ్మెల్సీ వంశీకృష్ణను ఇబ్బంది పెట్టారు కాబట్టే ఆయన వైసీపీని వీడారని వ్యాఖ్యానించారు. లిక్కర్ వ్యాపారంలో తనపై ఒక్క కేసు కూడా లేదని.. కానీ భూకబ్జాలు చేసినట్లుగా ఎంవీవీపై బోలెడన్నీ కేసులున్నాయని రామకృష్ణ బాబు ఆరోపించారు. ఆయన కుంభకోణాలు చెప్పాలంటే రెండు రోజులు కూడా సరిపోదని దుయ్యబట్టారు. ఎంపీగా ఈ నాలుగున్నరేళ్లలో విశాఖలో కనిపించావా అంటూ వెలగపూడి దుయ్యబట్టారు. తాను నీ వెంట్రుక పీకలేనని అన్నావని.. ప్రజలే నిన్ను ఎన్నికల్లో సముద్రంలో పడేస్తారని రామకృష్ణబాబు జోస్యం చెప్పారు.
అంతకుముందు నిన్న విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో పీకుతానని అంటున్నాడని, తన వెంట్రుక కూడా పీకలేడని సవాల్ విసిరారు. రామకృష్ణ అవకాశవాదని.. యాదవ సామాజిక వర్గాన్ని తొక్కేశాడని ఎంపీ ఆరోపించారు. వంగవీటి మోహనరంగాని నరికి పారిపోయాడని, అలాంటి రామకృష్ణ ఇప్పుడు రంగులు మార్చి పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని కాపుల ముందుకు వెళ్తున్నాడని ఎంవీవీ ఎద్దేవా చేశారు. తాను బిల్డర్గా పనిచేస్తున్నానని, అంతేకాని వెలగపూడిలా కల్తీ మద్యం అమ్మి ఎదగలేదని రామకృష్ణ విమర్శించారు. వంశీకృష్ణ లాంటి వారిపై స్పందించకూడదనే ఇంతకాలం మాట్లాడలేదని సత్యనారాయణ అన్నారు.
2019లో వెలగపూడి వంశీకి టికెట్ దక్కకపోవడానికి తాను కారణం కాదని స్పష్టం చేశారు. తనపై అనుమానం పెంచుకుని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎంవీవీ సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ తనపై గతంలో విమర్శలు చేస్తే తిరిగి చేశానని.. తానెప్పుడూ అనవసరంగా విమర్శలు చేయనని ఆయన పేర్కొన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన వంశీ .. విజయసాయిరెడ్డి కారణంగా కార్పోరేటర్ అయ్యారని తెలిపారు. వంశీపై చెక్ బౌన్స్ కేసులు, ఆస్తుల అటాచ్మెంట్స్ వున్నాయని పేర్కొన్నారు. రంగాను వెలగపూడి రామకృష్ణ ఎలా చంపాడో బయటపెడతానని.. తన అక్రమాలపై ఆధారాలు వుంటే తీసుకురావాలని ఎంవీవీ సత్యనారాయణ డిమాండ్ చేశారు.