వాల్తేరు వీరయ్య చిత్రం 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే.
వాల్తేరు వీరయ్య చిత్రం 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. చిరంజీవి చేసిన కామెంట్స్పై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. మరోవైపు జనసేన శ్రేణులు చిరంజీవి వ్యాఖ్యలకు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా చిరంజీవి వ్యాఖ్యలను సమర్ధించారు. చిరంజీవికి సన్నిహితునిగా పేరున్న గంటా శ్రీనివాసరావు ఈ మేరకు ట్విట్టర్లో ఓ పోస్టు చేశారు.
సాధారణంగా విమర్శలకు, వివాదాలకు దూరంగా ఉండే చిరంజీవి వంటి వారికి కూడా ఇబ్బంది కలిగి అలా మాట్లాడారంటే రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చునని గంటా శ్రీనివాసరావు అన్నారు. చిరంజీవి చెప్పిన దానిలో తప్పేముందని, ఆయన నిజాలే మాట్లాడారని చెప్పారు. ప్రభుత్వానికి ఒక సలహా ఇచ్చారు అంతే కదా అని అన్నారు.
‘‘మీరు ప్రత్యేక హోదా గురించి... రోడ్ల నిర్మాణం గురించి... ప్రాజెక్టుల గురించి.... పేదవాడి కడుపు నింపే ఉద్యోగ ఉపాధి కల్పన గురించి ఆలోచించి రాష్ట్రాన్ని ముందుకు నడిపించండి.. అలా కాదని పిచ్చుక పై బ్రహ్మాస్త్రం లాగా ఇండస్ట్రీ మీద పడతారేంటి... ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే ప్రభుత్వాలను గుండెల్లో పెట్టుకుంటారన్నారు. ఆయన చెప్పిన వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి వైపు దృష్టి సారించకుండా పట్టుమని పది నిముషాలు తమ శాఖలు గురించి మాట్లాడలేని మంత్రులందరూ మీడియా ముందుకు వచ్చి అదేదో బ్రహ్మాండం బద్దలైనట్టు ఏదేదో ఆయన గురుంచి మాట్లాడటం సరికాదు’’ అని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం సినిమా పరిశ్రమపై కాకుండా ఉద్యోగాలు, పేదలపై దృష్టి సారించాలన్న చిరంజీవి వ్యాఖ్యలను తెలుగు ప్రజలందరూ సమర్థిస్తున్నారని అన్నారు.
అసలేం జరిగిందంటే,వాల్తేరు వీరయ్య చిత్రం 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘ఎంతసేపు చిత్ర పరిశ్రమ గురించి కాదని.. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం గురించి, ప్రాజెక్టులు గురించి, పేదవారికి కడుపు నిండే పథకాలు, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం వాటి పెద్ద పెద్ద వాటి గురించి ఆలోచించాలి. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి?’’ అని వైసీపీ ప్రభుత్వానికి చిరంజీవి సుత్తిమెత్తగా చురకలు అంటించారు.
