పెన్షన్ ఇవ్వాలని అడిగితే  దేవినేని అవినాష్ మనుషులు  మహిళపై దాడికి దిగారని  విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు  ఆరోపించారు.  

విజయవాడ: దేవినేని అవినాష్ అనుచరులే మహిళలపై దాడులకు దిగారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రాహ్మోహన్ రావు చెప్పారు. మంగళవారం నాడు ఉదయం వైసీపీ, టీడీపీ మహిళా కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన మహిళను గద్దె రామ్మోహన్ రావు పరామర్శించారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళల కళ్లలో కారం కొట్టి దేవినేని అవినాష్ మనుషులు దాడులు చేశారన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి రౌడీయిజం చేయడం సరైందా అని ఆయన ప్రశ్నించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంచార్జీగా ఉంటున్న అవినాష్ ఇంతలా రౌడీయిజం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే విజయవాడ ఏమౌతుందో అర్ధం చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. గతంలో ఎన్టీఆర్ భవన్, పట్టాభి ఇళ్లపై జరిగిన దాడులలో దేవినేని అవినాష్ పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. చిన్న సమస్యపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని అడిగారు. పెన్షన్ అడిగిన ముస్లిం మహిళపై అవినాష్ అనుచరులు దాడికి దిగారన్నారు. పెన్షన్ ఇవ్వమని అడగడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. దందాలు, పంచాయితీలతో విజయవాడ ప్రశాంతతను చెడగొడుతున్నారన్నారు. వైసీపీ అరాచకాలను టీడీపీ తరపున అడ్డుకుంటామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. తాడేపల్లి ఆదేశాల మేరకు కేసులు పెడితే తీవ్ర పరిణామాలుంటాయని గద్దె రామ్మోహన్ హెచ్చరించారు.