Asianet News TeluguAsianet News Telugu

ఈఎస్ఐ స్కామ్: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి అరెస్టు

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో భారీ బందోబస్తు మధ్య ఆయనను అరెస్టు చేశారు. ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

TDP MLA, ex minister Achennaidu arrested in ESI scam
Author
Tekkali, First Published Jun 12, 2020, 8:15 AM IST

శ్రీకాకుళం: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అచ్చెనాయుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి మండలం నిమ్మాడలో ఆయనను అరెస్టు చేశారు. ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆ కుంభకోణం జరిగినట్లు అధికారులు గుర్తించారు. 

భారీ బందోబస్తు మధ్య ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన తర్వాత ఆయనను విజయవాడకు తరలిస్తున్నారు.అచ్చెన్నాయుడు సిఫార్సుల కారణంగానే అక్రమాలు జరిగినట్లు దర్యాప్తులో నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ (టీడీఎల్పీ) ఉప నేతగా ఆయన ఉన్నారు. శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అచ్చెన్నాయుడి అరెస్టు జరిగింది. 

అచ్చెన్నాయుడు కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు రూ.988 కోట్ల కొనుగోళ్లు జరిగాయని, ఇందులో రూ.150 కోట్ల కుంభకోణం జరిగిందని అవినీతి నిరోధక శాఖ (ఎసీబీ) అధికారులు గుర్తించారు. అచ్చెన్నాయుడు సిఫార్సు మేరకు నామినేషన్ పద్ధతిలో కొనుగోళ్లు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.  

మరో మాజీ మంత్రి పాత్ర కూడా ఈసీఐ కుంభకోణంలో పాత్ర ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆయనను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని అంటున్నారు.  అచ్చెన్నాయుడి కుటుంబ సభ్యులను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో మొత్తం 40 మంది ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. మందులు, పరికరాలు,ల్యాబ్ పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. నకిలీ కొటేషన్లతో వ్యవహారం నడిపినట్లు తేలింది. 

కొనుగోళ్ల టెండరింగులో అచ్చెన్నాయుడి కుమారుడి పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయి. కాగా, ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేష్ కుమార్ ను తిరుపతిలో అరెస్టు చేశారు. 

రూ11 విలువ చేసే గ్లూకోజ్ ఎన్లైజర్ స్ట్రిప్స్ ను రూ.62గా, సోడియం పొటాషియం ఎలక్ట్రోడ్ ల ధరలను భారీగా పెంచేసి రూ.44 వేల చొప్పున చెల్లించినట్లు దర్యాప్తులో తేలింది. ఆస్పత్రులకు వెళ్లకుండానే బిల్లులు చెల్లించినట్లు తేలింది. ఏ విధమైన సర్టిఫికెట్లు లేకుండానే బిల్లుపై డైరెక్టర్లు సంతకాలు చేసినట్లు తేలింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios