Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుపై దాడి .. ఆయన కనుసైగ చేస్తే తట్టుకోలేరు, ఎగిరిపడితే బడిత పూజే : జగన్‌కు అచ్చెన్న వార్నింగ్

నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై రాళ్ల దాడిపై తెలుగుదేశం నేతలు ఘాటుగా స్పందించారు. దాడి చేసిన వారిని, దాడి చేయించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ డిమాండ్ చేశారు. 

tdp leaders response on attack on chandrababu naidu convoy in nandigama
Author
First Published Nov 4, 2022, 8:04 PM IST

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం నిర్వహించిన రోడ్ షోపై కొందరు దుండగులు రాళ్ల దాడికి పాల్పడిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై తెలుగు దేశం నేతలు మండిపడుతున్నారు. ఈ ఘటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై రాళ్ల దాడి వైసీపీ రౌడీ రాజకీయానికి పరాకాష్ట అన్నారు. చంద్రబాబు సభలకు వస్తున్న ప్రజా స్పందన చూసి ఏసీలో ఉండి కూడా జగన్ రెడ్డికి చెమటలు పడుతున్నాయని అచ్చెన్నాయుడు సెటైర్లు వేశారు. 

ఒక పార్టీ జాతీయ అధ్యక్షునిపై దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రౌడీ రాజకీయాలతో మమ్మల్ని భయపెట్టాలనుకోవడం పగటి కల అని జగన్‌పై ఘాటు విమర్శలు చేశారు అచ్చెన్నాయుడు. చంద్రబాబు నాయుడు కనుసైగ చేస్తే మా కార్యకర్తల చేతిలో వైసీపీ గుండాల పరిస్థితి ఏంటి అని ఆయన హెచ్చరించారు. అధికారం ఉంది కదా అని బరి తెగిస్తే బడితే పూజ తప్పదని అచ్చెన్నాయుడు హితవు పలికారు. దాడి చేసిన వారిని, దాడి చేయించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ALso REad:నందిగామలో చంద్రబాబు రోడ్ షోపై రాళ్ల దాడి.. సెక్యూరిటీ ఆఫీసర్‌కు గాయాలు

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై రాళ్ల దాడి పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ  వైఫల్యమేనని.. జగన్ రెడ్డి పట్టపగలే ప్రజాస్వామ్యన్ని హత్య చేస్తున్నారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి తమ కార్యకర్తలకి ఎదుటివారిపై దాడులు చేయమని లైసెన్సులు ఇచ్చి రోడ్ల మీదకి వదిలినట్టున్నారని రామకృష్ణుడు ఆరోపించారు. పార్టీ జాతీయ అధ్యక్షునిపై దాడి జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారా అని యనమల మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి, డీజీపీ వహించాలని ఆయన డిమాండ్ చేశారు. 

కాగా... ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్డు షోలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు ర్యాలీపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు గాయాలయ్యాయి. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Follow Us:
Download App:
  • android
  • ios