పరిటాల సునీతపై సొంతపార్టీ నేతల ఫైర్
మంత్రి పరిటాల సునీతపై సొంత పార్టీ నేతల నుంచి ఊహించని షాక్ తగిలింది.
ఏపీ మంత్రి పరిటాల సునీతపై సొంత పార్టీ నేతల నుంచి ఊహించని షాక్ తగిలింది. సొంత పార్టీ నేతలే ఆమెపై మండిపడ్డారు. తమపై మంత్రి సునీత సోదరుడు మురళీ ఆధిపత్యం చలాయిస్తున్నాడని.. అతనికి ఆ హక్కులేదని రాప్తాడు మండల కార్యకర్తలు మండిపడుతున్నారు.
మండలాధ్యక్షుడు దగ్గుపాటి ప్రసాద్కు సమాచారం ఇవ్వకుండా గ్రామదర్శిని కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారని ఆయన వర్గీయులు ఆందోళన చేశారు. మురళి ఆదేశాల మేరకు బండమీదపల్లిలో గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు సిద్ధపడటంతో అక్కడికి చేరుకున్న టీడీపీ కార్యకర్తలు.. ప్రొటోకాల్ ప్రకారం ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్కు సమాచారం ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అధికారులు కార్యక్రమం నిర్వహించకుండానే వెనుదిరిగారు. కాగా ఈ విషయమై పరిటాల వర్గంలో చర్చ మొదలైంది.