ఎన్నో కేసుల్లో ఏ2.. రాజ్యసభకు అధ్యక్షత వహించడమా : విజయసాయిపై వర్ల రామయ్య సెటైర్లు
రాజ్యసభకు కాసేపు విజయసాయిరెడ్డి నేతృత్వం వహించడంపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య సెటైర్లు వేశారు. ఎన్నో కేసుల్లో ముద్ధాయిగా వున్న వ్యక్తి... సభను నడిపించి అవమానించారని ఆయన ఎద్దేవా చేశారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభకు కాసేపు అధ్యక్షత వహించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం వరుస ట్వీట్లు చేశారు.
'ప్రజాస్వామ్యమా వర్ధిల్లు! ఎన్నో కేసుల్లో ముద్దాయి, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతూ, భారతదేశంలో A2 గా గుర్తించబడిన విజయసాయి రెడ్డి, నిన్న రాజ్యసభకు అధ్యక్షత వహించి సభను నడిపించారట! ఇంతటి నేర చరిత్రను కలిగిన వ్యక్తి, అంతటి రాజ్యసభకు అధ్యక్షత వహించడం విడ్డూరం కదూ? పెద్దల సభకు అవమానం కదూ?' అని విమర్శించారు.
మరోవైపు రాజ్యసభను కొద్దిసేపు నడిపించడంపై విజయసాయి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తొలిసారిగా రాజ్యసభను నడిపించే అవకాశం దక్కడాన్ని విశిష్ట గౌరవంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఆరేళ్ల కిందట రాజ్యసభలో వైసీపీ తరఫున ఒకే ఒక్కడిని ఉండేవాడినని, ఇప్పుడిలా చైర్మన్ స్థానంలో సభను నడిపించే భాగ్యం లభించిందన్నారు. సీఎం వైఎస్ జగన్, భారతీ, ఏపీ ప్రజల దీవెనల వల్లే సాధ్యమైందన్నారు.