రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వుండగా.. ఎవరినో ఎందుకు వెతుకుతున్నారని ఆయన ప్రశ్నించారు.   

ప్రస్తుతం దేశంలో రాష్ట్రపతి ఎన్నికల వేడి (presidential election) కనిపిస్తోంది. బలమైన అభ్యర్ధిని నిలబెట్టాలని కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ, విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడితో (venkaiah naidu) ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా (amit shah) భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

ఈ నేపథ్యంలో టీడీపీ (tdp) సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (somireddy chandramohan reddy) స్పందించారు. జులై 18న దేశంలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయని.. దేశంలో అత్యున్నతమైన, రాజ్యాంగపరమైన పదవి... రాష్ట్రపతి పదవి అని ఆయన అన్నారు. ప్రపంచదేశాలన్నీ ఈ పదవికి గౌరవం ఇస్తాయని.. అయితే, ఎన్డీయే (upa) , యూపీఏ (nda), అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రపతి అభ్యర్థి కోసం వెతుకుంటే ఆశ్చర్యం కలుగుతోందని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. ముప్పవరపు వెంకయ్యనాయుడి వంటి మచ్చలేని మహోన్నత వ్యక్తిని చేతిలో పెట్టుకుని రాష్ట్రపతి అభ్యర్థి కోసం పాకులాడుతున్నాయని ఆయన దుయ్యబట్టారు. గతంలో ఉపరాష్ట్రపతులు రాష్ట్రపతి అయిన సంప్రదాయం ఉందని.. వెంకయ్యనాయుడిది నిష్కల్మష జీవితమని, ఆయన జీవితం ప్రజలకు అంకితమని చంద్రమోహన్ రెడ్డి గుర్తుచేశారు.

Also REad:రాష్ట్రపతి ఎన్నికలు: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో అమిత్ షా, జేపీ నడ్డా భేటీ

అధికారంలో ఉండే ప్రభుత్వ పెద్దలకు, ఎన్డీయే మిత్రపక్షాలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా... మీరు వెంకయ్యనాయుడు పేరును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలన్నారు. ఎలాంటి పోటీలేకుండా రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం చేసుకోవడానికి ఇదే అవకాశమని.. ఆయన పేరు ప్రకటిస్తే, ఆయనకు పోటీగా అభ్యర్థిని బరిలో దింపడానికి విపక్షాలు కూడా సాహసించవని చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వెంకయ్యనాయుడి వంటి మంచి వ్యక్తి రాష్ట్రపతి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని ఆయన అన్నారు. రాష్ట్రపతి ఎన్నికలను ఇంత వివాదాస్పదం చేసుకోవాల్సిన అవసరంలేదని సోమిరెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్షాలు రోజుకొక అభ్యర్థిని తెరపైకి తీసుకురావాల్సిన అవసరం లేదని.. వెంకయ్యనాయుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రపంచదేశాల్లో భారత్ కు గౌరవం మరింత పెరుగుతుందని చంద్రమోహన్ రెడ్డి సూచించారు