ఆస్తులపై దేవుడి ముందు ప్రమాణం చేస్తారా : పుష్పశ్రీవాణికి పల్లవిరాజు సవాల్
విజయనగరం జిల్లాలో మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణిపై మండిపడ్డారు టీడీపీ నేత శత్రుచర్ల పల్లవిరాజు. తన ఆస్తుల వివరాలపై పుష్పశ్రీవాణి కులదైవం ముందు ప్రమాణం చేస్తారా? అని పల్లవిరాజు సవాల్ విసిరారు.
మాజీ మంత్రి పుష్పశ్రీవాణిపై (pamula pushpa sreevani) ధ్వజమెత్తారు టీడీపీ (tdp) నేత శత్రుచర్ల పల్లవిరాజు (satrucharla pallavi raju) . ఆదివారం మన్యం జిల్లా కురుపాలంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆమె మాట్లాడుతూ.. తన తండ్రి చంద్రశేఖర్ రాజు పుణ్యమా అని పుష్పశ్రీవాణి గెలిచారని తెలిపారు. తన ఆస్తుల వివరాలపై పుష్పశ్రీవాణి కులదైవం ముందు ప్రమాణం చేస్తారా? అని పల్లవిరాజు సవాల్ విసిరారు. మీ ఆస్తుల వివరాల ఆధారాలతో సహా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం అని ఆమె ఎమ్మెల్యే పుష్పశ్రీవాణికి తెలిపారు. గడపగడపకు కార్యక్రమంలో ప్రశ్నించినవారిపై కేసులు పెడతారా అంటూ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పల్లవిరాజు హెచ్చరించారు.
అటు, మన్యం జిల్లా చినమేరంగికోటలో ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనూ పుష్పశ్రీవాణి లక్ష్యంగా విమర్శలు గుప్పతించారు. పుష్పశ్రీవాణి.. శత్రుచర్ల బ్రాండ్ పెట్టుకుని రాజకీయం చేస్తోందని విజయరామరాజు అన్నారు. వ్యక్తిగతంగా రాజకీయంలోకి దిగితే నీ ఓటు బ్యాంకు ఎంతో తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
పుష్పశ్రీవాణికి రూ.500 కోట్లకు పైబడి ఆస్తులు ఉన్నట్టు రుజువు చేస్తామని... దీనిపై ఎక్కడ చర్చించడానికైనా సిద్ధంగా ఉన్నామని విజయరామరాజు (satrucharla vijaya rama raju) పేర్కొన్నారు. పోలీసులు లేకుండా గడపగడపకు తిరిగితే మీ అభివృద్ధి ఏంటో తెలుస్తుందని ఆయన అన్నారు. టీడీపీ నేతలపై చిటికలు వేస్తే మీ వేళ్లు లేకుండా చేస్తామని విజయరామరాజు హెచ్చరించారు. మాపై ఎలా దాడి చేస్తే అదే మాదిరి మేము కూడా దాడి చేస్తాం అని శత్రుచర్ల విజయరామరాజు తెలిపారు. మరోవైపు తనకు రూ.5 కోట్ల ఆస్తులు ఉన్నట్టు రుజువు చేయాలని, అలా చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని పుష్పశ్రీవాణి సవాల్ చేశారు.