పుంగనూరు వీరప్పన్ పెద్దిరెడ్డి డైరెక్షన్ ... ఎర్రచందనం స్మగ్లర్లకు వైసిపి టికెట్లు : నారా లోకేష్
అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల చేతిలో దారుణ హత్యకు గురయిన కానిస్టేబుల్ గణేష్ కు టిడిపి నేత నారా లోకేష్ నివాళి అర్పించారు. పుంగనూరు వీరప్పన్ పెద్దిరెడ్డి డైరెక్షన్ లోనే రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందని లోకేష్ ఆరోపించారు.
![TDP Leader Nara Lokesh serious on Red sandalwood smuggling in Andhra Pradesh AKP TDP Leader Nara Lokesh serious on Red sandalwood smuggling in Andhra Pradesh AKP](https://static-ai.asianetnews.com/images/01hbav9rcn3fezqxdbzrrt5mg0/yuvagalam-1706643740717408650-01-jpg_363x203xt.jpg)
చిత్తూరు : ఆంధ్ర ప్రదేశ్ లో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. తమ వాహనాన్ని అడ్డుకోడానికి ప్రయత్నించిన కానిస్టేబుల్ ను స్మగ్లింగ్ ముఠా పొట్టనపెట్టుకుంది. ఈ దారుణం గత రాత్రి అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... శేషాచలం అడవుల్లో మాత్రమే లభించే ఎర్రచందనంకు అంతర్జాతీయ మార్కెట్ లో మంచి గిరాకీ వుంది. దీంతో వీటిని అక్రమంగా నరికి తరలించే స్మగ్లింగ్ ముఠాలు ఏపీలో పెరిగిపోయాయి. పోలీసులు, అటవీ అధికారుల కళ్ళుగప్పి ఎర్రచందనం దుంగలను రాష్ట్రాన్నే కాదు దేశాన్ని దాటిస్తున్నారు కేటుగాళ్లు. ఇలాంటి ఓ ముఠా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా పోలీసులకు సమాచారం అందింది. దీంతో గత రాత్రి టాస్క్ పోర్స్ సిబ్బంది సుండుపల్లి సమీపంలోని గొల్లపల్లి చెరువు వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు.
ఇదే సమయంలో అటువైపు వేగంగా దూసుకొస్తున్న కారును కానిస్టేబుల్ గణేష్ ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ కారులో ఎర్రచందంనం దుంగలు వుండటంతో పట్టుబడతామని గ్రహించిన స్మగ్లర్లు బరితెగించారు.అదే వేగంతో కానిస్టేబుల్ పైకి కారును పోనిచ్చి ఢీకొట్టారు. దీంతో గణేష్ అక్కడే కుప్పకూలిపోగా స్మగ్లర్లు పరారయిపోయారు. తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ ను పీలేరు హాస్పిటల్ తరలిస్తుండగా మార్గమధ్యలో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్ల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు ఇద్దరు స్మగ్లర్లతో పాటు ఎర్రచందనం తరలిస్తున్న కారును స్వాధీనం చేసుకున్నారు.
Also Read జనసేన కార్యాలయం ముందు కత్తులతో రెక్కీ ... టార్గెట్ ఆయనేనా?
అయితే ఎర్రచందనం స్మగ్లర్ల చేతిలో పోలీస్ కానిస్టేబుల్ గణేష్ దారుణ హత్యకు గురవడంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేసారు. వైసిపి పాలనలో ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియా దారుణాలు పరాకాష్టకు చేరాయని... స్మగ్లర్ల చేతిలో పోలీసులు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. సర్కారీ పెద్దల అండదండలతో స్మగ్లర్లు ఇంతలా బరితెగిస్తున్నారని ఆరోపించారు. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన గణేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని... అతడిని చంపిన దుండగులను, వారి వెనకున్న వారిని కఠినంగా శిక్షించాలని లోకేష్ డిమాండ్ చేసారు.
జగన్ పాలన ఎర్రచందనం స్మగ్లర్ల పాలిట స్వర్ణయుగమైందని లోకేష్ అన్నారు. పుంగనూరు వీరప్పన్ పెద్దిరెడ్డి, అంతర్జాతీయ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి ఆధ్వర్యంలోనే ఈ ఎర్రచందనం మాఫియా కొనసాగుతోందన్నారు. చివరకు ఎర్రచందనం స్మగ్లర్లను వైసిపి అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారని... రాబోయే రోజుల్లో స్మగ్లింగ్ కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తారేమో అంటూ నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేసారు.