జగన్ ప్రభుత్వంలో రెండు భారీ కుంభకోణాలు.. మహానాడు తర్వాత బయటపెడతా : నారా లోకేష్ సంచలనం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం చేసిన రెండు భారీ కుంభకోణాలు త్వరలోనే బయటపెడతానని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద పక్కా ఆధారాలు వున్నాయని నారా లోకేష్ వెల్లడించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్పై (ys jagan) సంచలన ఆరోపణలు చేశారు నారా లోకేష్ (nara lokesh) . మహానాడు (mahanadu) అయ్యాక జగన్ చేసిన రెండు భారీ కుంభ కోణాలను బయటపెడతానని ప్రకటించారు. ఆ కుంభకోణాలకు సంబంధించి పక్కా ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు లోకేష్. అదాని, అరబిందో, గ్రీన్కో సంస్థలతో ఒప్పందానికి జగన్ దావోస్ వెళ్లారా అని ప్రశ్నించారు. అదానీ, గ్రీన్ కోలను ఏపీ నుంచి వెళ్లగొట్టి.. వారితో అన్ని సెటిల్ చేసుకున్నాకే ఒప్పందాలు కుదిరాయని ఆయన ఆరోపించారు.
మహానాడు వద్ద మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన లోకేష్ ఈ మేరకు హాట్ కామెంట్స్ చేశారు. ఇక.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమేనని ప్రకటించారు నారా లోకేష్. పార్టీ ఆదేశిస్తే పాదయాత్రే కాదు.. ఎలాంటి పోరాటానికైనా సిద్ధమేనని తెలిపారు. పొత్తులనేవి ఎన్నికలప్పుడు జరిగే చర్చ అన్న ఆయన.. అందరూ కలవాలని పవన్ కల్యాణ్, చంద్రబాబు ఆలోచిస్తున్నారని చెప్పారు. ప్రజలంతా కలిసి ప్రజా కంఠక ప్రభుత్వాన్ని దింపాలనే ఆలోచనతోనే వున్నారని తెలిపారు నారా లోకేష్.
Also Read:టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తప్పుకుంటా.. మూడుసార్లు ఓడితే నో టికెట్ : మహానాడులో నారా లోకేష్
అంతకుముందు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వరుసగా మూడు సార్లు ఓడితే టికెట్ ఇచ్చేది లేదని.. అలాగే ఇకపై ఎవరికైనా రెండు సార్లే పదవులు దక్కుతాయి లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే సారి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తానూ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఏళ్ల తరబడి పదవుల్లో వుంటే కొత్త రక్తం ఎలా వస్తుందని లోకేష్ ప్రశ్నించారు. 30 నియోజకవర్గాల్లో నేతలు ఇప్పటికీ యాక్టీవ్గా లేరని.. పనిచేయని నేతలకు ఇన్ఛార్జ్ పదవులు వుండవని ఆయన హెచ్చరించారు. కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్లకు దండం పెడితే గెలిచే పరిస్థితి వుందని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. అధికారంలోకి వస్తే మంత్రులు పార్టీకి రిపోర్టు చేసే వ్యవస్థ తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇకపోతే.. మహానాడులో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. వైసీపీ అవినీతి వల్లే రాష్ట్రం దివాళా తీసిందని ఎద్దేవా చేశారు. సంక్షేమం లేదని, అంతా మోసకారి సంక్షేమమేనంటూ చంద్రబాబు దుయ్యబట్టారు. పోలవరంలో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చిందని... అక్కడ ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 30 లక్షల ఇళ్లని చెప్పిన మీరు కట్టింది మూడే ఇళ్లని.. అడిగితే కేసులు పెడుతున్నారని, మీ కేసులు మమ్మల్ని ఏమీ చేయలేవని చంద్రబాబు స్పష్టం చేశారు. వర్షాకాలంలో రోడ్లపై చేపలు పట్టేలా నీళ్లు ఉంటున్నాయని సెటైర్లు వేశారు.